కడప స్టీల్‌ ప్లాంట్‌కు రూ.500 కోట్లు

CM YS Jagan Comments in review On Construction of Kadapa Steel Plant - Sakshi

ప్లాంట్‌ ఏర్పాటుపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌

ఈక్విటీ కింద ఈ మొత్తం కేటాయించాలని ఆదేశం

సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌ నిర్మాణంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపామని చెప్పారు. ఆయా సంస్థల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి. 

నెలాఖరులోగా టెక్నికల్‌ సర్వే పూర్తి
► ఆ సంస్థలతో చర్చలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. చర్చల అనంతరం ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో 2 నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు. 
► రెండేళ్లలో టౌన్‌షిప్, అనుబంధ మౌలిక వసతుల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా సాయిల్‌ టెస్టింగ్, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. 
► ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్‌ వాల్, విద్యుత్‌ సరఫరా కోసం నిర్మాణపు పనులు, ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం విద్యుత్‌.. ఆర్టీపీపీ లైన్, నిర్మాణ పనుల కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
► సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, పలువురు అధికారులు పాల్గొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top