
ఎగ్గొట్టేందుకేనా ఈ ఎత్తుగడలు?
వరమనుకున్న రుణమాఫీ అన్నదాతల్లో అనేకులను వెన్నాడే శాపంగా మారింది. ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నట్టు చంద్రబాబు తొలి సంతకం పెట్టిన క్షణం నుంచే వారు ఆశనిరాశల
వరమనుకున్న రుణమాఫీ అన్నదాతల్లో అనేకులను వెన్నాడే శాపంగా మారింది. ఎన్నికల హామీకి కట్టుబడి ఉన్నట్టు చంద్రబాబు తొలి సంతకం పెట్టిన క్షణం నుంచే వారు ఆశనిరాశల నడుమ ‘ఫుట్బాల్’లా మారిపోయారు. రుణభారం ఎంత మేరకు విరగడవుతుందో తెలియని సందిగ్ధం, ఎవరికి మాఫీ అవుతుందో తెలియని అస్పష్టత, సర్కారు ఏ రోజు ఏ కొత్త మెలిక వేసి ఎందరిని అనర్హులను చేస్తుందో తెలియని అయోమయం.. ఇలాంటి దశలన్నీ దాటి.. ఎంతో కొంత లబ్ధి దక్కనుందన్న తరుణంలోనూ.. ఎందరో అన్నదాతలు అడకత్తెరలో పోకచెక్కల్లా నలిగిపోతున్నారు.
అమలాపురం :రుణమాఫీ అమలులో దారుణమైన జాప్యం జరిగినా, ఓరిమితో ఎదురు చూసినా పలువురు రైతులకు చివరి క్షణంలోనూ మానసికంగా చిత్రహింస తప్పడం లేదు. నిరాశానిస్పృహల మధ్య కొట్టుమిట్టాడక తప్పడంలేదు. గత రెండురోజులుగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఆధార్ అనుసంధాన జాబితాలో కొంతమంది రైతులను తిరస్కరణ జాబితాలో ఉంచారు. ఇటువంటి వారి ఆధార్ వివరాలను సవరిస్తామంటూ, అందుకు కేవడం సోమవారం సాయంత్ర వరకే గడువు పెట్టడం రైతులను విపరీతమైన ఒత్తిడికి లోను చేస్తోంది.
రుణమాఫీ రైతుల ఆధార్ స్టేటస్ రిపోర్టులు ప్రభుత్వం నుంచి సహకార, వాణిజ్య బ్యాంకులకు చేరాయి. కొంతమంది రైతుల ఆధార్ నంబర్లు అనుసంధానం కాలేదని వీటిలో ఉంది. అలాంటి వారిలో ఆధార్ నంబర్లు ఇచ్చే అవకాశం లేనివారే కాదు.. పక్కాగా ఆధార్ నంబరు ఇచ్చినవారు, ఆధార్ కార్డు జిరాక్సులు అందజేసినవారి పేర్లు కూడా. జిల్లా వ్యాప్తంగా ప్రతి సహకార సంఘం, వాణిజ్య బ్యాంకుల పరిధిలో కనీసం 20 నుంచి 40 మంది వరకు రైతుల ఆధార్ నంబర్లు అనుసంధానం కానట్టు రిపోర్టులు వచ్చాయి. ఇది అలా కాని రైతులను కలవరానికి గురిచేస్తోంది. వచ్చిన జాబితాలో అనుసంధానమైన వారిపేర్లు, కానివారిపేర్లు ఉండగా కొందరి పేర్లు అసలే కనిపించడం లేదు.
డేటా ఎంట్రీ చేసినట్టు వీరి వద్ద కాపీ ఉన్నా... మాఫీ జాబితాలో పేర్లు గల్లంతవడం హతాశులను చేస్తోంది. దీనిపై సహకార సంఘాలు, వాణిజ్య బ్యాంకుల మేనేజర్లు తమ పై అధికారులను సంప్రదిస్తున్నా సరైన సమాచారం రావడంలేదు. అయితే మరోసారి ఆధార్ నంబర్లు తీసుకుంటామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. సోమవారం సాయంత్రంలోపు జన్మభూమి గ్రామ కమిటీలకు వివరాలు అందజేయాలని సూచించింది. తొలుత రైతు ఆధార్ కార్డు జిరాక్సు లేదా నంబరు మాత్రమే సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు మొత్తం రైతు కుటుంబ వివరాలను ఇవ్వాలంటూ ఒక ఫారాన్ని విడుదల చేసింది. దీనిలో రైతుతోబాటు కుటుంబ సభ్యుల పేర్లు, ఇలు, ఆధార్, రేషన్ కార్డు, ఆఖరికి ఓటర్ ఐడెంటిటీ కార్డు నంబరు కూడా నమోదు చేయాలని నిర్దేశించింది. ‘ఇవన్నీ ఎందుకు ‘బాబూ!’ అని రైతులు ప్రశ్నిస్తే జవాబిచ్చే వారే లేకుండా పోయారు.
సమాచారమే లేదంటున్న జన్మభూమి కమిటీలు
కాగా తమ పేర్లు ఆధార్కు అనుసంధానం కాకపోవడంతో మాఫీ వర్తించే అవకాశం లేదని, వెంటనే ఆధార్ నంబరు, జిరాక్సు తీసిన కార్డులను జన్మభూమి గ్రామ కమిటీలకు అందజేయాలని సహకార సంఘాలు, బ్యాంకుల నుంచి సమాచారం అందుకున్న రైతులకు గుండెల్లో రాయి పడ్డట్టయింది. వారు నానా హైరానా పడుతూ జన్మభూమి గ్రామ కమిటీలను ఆరా తీస్తున్నారు. అయితే రైతుల నుంచి ఆధార్ నంబరు, కార్డులు తీసుకోవాలని తమకేమీ సమాచారం రాలేదనడంతో అన్నదాతలు అయోమయంలో విలవిలలాడుతున్నారు. సోమవారం సాయంత్రం వరకు గడువుపెట్టి ఇప్పటికీ జన్మభూమి గ్రామ కమిటీలకు సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం సెలవు కావడంతో ఒక్కరోజులో వీటిని ఎలా అందించగలమని ప్రశ్నిస్తున్నారు. కాగా కొన్ని బ్యాంకుల నుంచి రైతులకు ఇప్పటికీ ఆధార్ అనుసంధానం కాలేదన్న సమాచారం అందలేదు. దీనితో వీరంతా అనర్హుల జాబితాలోకి వెళ్లే ప్రమాదం ఏర్పడింది. ఏ వంక దొరుకుతుందా.. లబ్ధిదారుల సంఖ్యకు కత్తెర వేద్దామా అన్న దురుద్దేశంతోనే ప్రభుత్వం ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నుతోందని రైతులు దుమ్మెత్తిపోస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా నిజాయితీతో వ్యవహరించాలని, సవరణ జాబితా తీసుకోడానికి గడువు పెంచాలని కోరుతున్నారు.
అన్నీ ఇచ్చినా అనుసంధానం కాలేదట..
నేను కౌలుకు, సొంతంగా మూడెకరాలు సాగు చేస్తున్నాను. గత ఏడాది దేవగుప్తం సహకార సంఘంలో రూ.30 వేలు అప్పు చేశాను. ఆధార్ కార్డు, రేషన్కార్డు, ఓటరు ఐడీ, పట్టాదారుపాస్ పుస్తకం జిరాక్సులు ఇచ్చాను. డేటా ఎంట్రీ చేసి ఇచ్చిన స్లిప్లో ఆధార్ నంబరు సరిగానే నమోదైందని ఉంది. తీరా జాబితాలో నా ఆధార్ అనుసంధానం కాలేదని వచ్చింది.
- చిత్తూరు నాగేశ్వరరావు,
రైతు, దేవగుప్తం, అల్లవరం మండలం
ఎవరిని అడిగినా జవాబు లేదు..
నేను మూడెకరాలు సాగు చేస్తున్నాను. సొసైటీలో రూ.75 వేలు అప్పు చేశాను. రుణ మాఫీ కోసం ప్రభుత్వం అడిగిన అన్ని వివరాలూ అందజేశాను. తీరా జాబితాలో మొత్తం నాపేరే లేపేశారు. దీనిపై ఎవరిని అడిగినా సమాధానం రావడంలేదు.
- బీమాల దుర్గారావు, రైతు,
డి.రావులపాలెం, అల్లవరం మండలం