బాబు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే: ధర్మాన కృష్ణదాస్ | Chandrababu Naidu cheating BCs: ysrcp leader dharmana krishnadas | Sakshi
Sakshi News home page

బాబు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే: ధర్మాన కృష్ణదాస్

Nov 10 2014 1:36 PM | Updated on Sep 2 2018 5:11 PM

బాబు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే: ధర్మాన కృష్ణదాస్ - Sakshi

బాబు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే: ధర్మాన కృష్ణదాస్

కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందని శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు అన్యాయం జరిగిందని  శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్ఆర్ సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యానించారు. మొదట అశోక్ గజపతిరాజుకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి టీడీపీ బీసీలకు అన్యాయం చేసిందని ఆయన సోమవారమిక్కడ అన్నారు. చంద్రబాబు నాయుడు దృష్టిలో బీసీ అంటే బిజినెస్ క్లాసే అని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. విస్తరణలో అవకాశం వస్తుందని ఎదురు చూసినవారికి నిరాశే మిగిల్చారన్నారు.

 సుజనా చౌదరిలాంటి వ్యాపారవేత్తను కేంద్రమంత్రిని చేసిన వైనానికి విస్తుపోతున్నామని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. అధికారంలోకి రాకముందు బీసీ  జపం చేసిన చంద్ర బాబు  కేంద్ర మంత్రి వర్గంలో బీసీలకు  స్థానం ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి పదవులు కట్టబెట్టడం చూస్తే బాబు వైఖరి అర్ధం అవుతోందని ఆయన అన్నారు. దీనికి చంద్రబాబు పెద్ద మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. 21మందిని రాజ్యసభ సభ్యులుగా టీడీపీ చేస్తే అందులో నలుగురైదుగురు మాత్రమే బీసీలు ఉన్నారన్నారు.

 

సుజనా అక్రమాలపై ఆంధ్రజ్యోతి దినపత్రికలో అనేక కథనాలు వచ్చాయని ధర్మాన కృష్ణదాస్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సృజనాత్మక మాయ అంటూ అనేక కథనాలు వచ్చాయని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు కేంద్రమంత్రిని చేశారన్నారు. అధికారం, పార్టీ ప్రయోజనాల కోసమే చంద్రబాబు తాపత్రయమని ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement