‘యాక్సిడెంట్లో చావకుండా బతికి వచ్చావెందుకు? నీకోసం లక్షలాది రూపాయలు తగిలేసి మనశ్శాంతి లేకుండా పోతోంది..చస్తే పీడ విరగడవుతుంది...
కడప అర్బన్, న్యూస్లైన్ : ‘యాక్సిడెంట్లో చావకుండా బతికి వచ్చావెందుకు? నీకోసం లక్షలాది రూపాయలు తగిలేసి మనశ్శాంతి లేకుండా పోతోంది..చస్తే పీడ విరగడవుతుంది...అంటూ రోజూ భర్త వేధింపులు, అత్త ఆరళ్లు ఆమె మనస్సును తీవ్రంగా కృంగదీశాయి. తన జీవితంలాగానే బిడ్డల జీవితం కూడా వారి మధ్య చిధ్రమవుతుందని భావించిందో ఏమో.. ఓ వివాహిత బలవన్మరణం చెందింది. ఈ సంఘటన బయటికి పొక్కనీయకుండా ఊళ్లో కొందరు పెద్దమనుషులు రాజీ కుదిర్చి సదరు మహిళ మృతదేహాన్ని కాల్చేశారు. చేతులు దులుపేసుకున్నామన్న సమయంలో విషయం బయటికి పొక్కింది.
మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. వివరాల్లోకి వెళితే....కడప కార్పొరేషన్ పరిధిలోని పాలెంపల్లెకు చెందిన ఎం.సుబ్బరాయుడు తొమ్మిదేళ్ల కిందట అదే గ్రామానికి చెందిన చెన్నకేశ్వరిని వివాహం చేసుకున్నాడు. వీరికి ఇందువదన(8), అలైఖ్య(6), వెంకటసుశాంత్(4) సంతానం కలిగారు. వ్యవసాయం ద్వారా కుటుంబాన్ని పోషిస్తున్న సుబ్బరాయుడుతోపాటు తల్లి రామలక్షుమ్మ ఉంటోంది. తన తల్లిదండ్రులకు మూడవ కుమార్తె అయిన చెన్నకేశ్వరి అత్తారింటిల్లో కుటుంబ సభ్యులతో హాయిగా జీవిస్తుండేది. తొమ్మిది నెలల క్రితం ఆమె పొలం నుంచి ఇంటికి వస్తుండగా ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడింది. కాలు విరగడంతో ఆపరేషన్ కోసం భర్త సుబ్బరాయుడు రూ.4 లక్షల వరకు ఖర్చు చేశాడు.
అప్పటి నుంచి ఆమె అదే గ్రామంలోని అక్క లక్ష్మిదేవి ఇంటిలో ఉంటోంది. పిల్లలు ఆమె కోసం వస్తూ వెళుతూ ఉండేవారు. కాలు కుదుటపడడంతో నెల రోజుల క్రితం తన భర్త ఇంటికే వచ్చి ఉంటోంది. ఆమె వచ్చినప్పటి నుంచి భర్త సుబ్బరాయుడు, అత్త రామలక్షుమ్మలు వేధించసాగారు. నోటికొచ్చినట్లు తిట్టేవారు. వారి వేధింపులతో ఆమె కృంగిపోయింది. ఈనెల 29వ తేది ఉదయం తన ఇంటిలో పిల్లలకు విష ద్రావణం తాపించి, తానూ చీరెతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కానీ, పిల్లలు సరిగా విషద్రావణం తాగకపోవడంతో అస్వస్థతకు గురై పడిపోయారు. కొంతసేపటి తర్వాత పెద్ద కుమార్తెకు మెలకువరావడంతో ఇంటి గడియ తీయగలిగింది.
అప్పటికే తల్లి మృతి చెందింది. ఇదేమి తెలియని ఇందువదన చుట్టుపక్కల వారితో తన తల్లి పైపునకు వేలాడుతోందని గట్టిగా అరిచింది. పిల్లలను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తర్వాత భర్త, అత్త, బంధువులు పెద్ద మనుషులను ఆశ్రయించగా రాజీకి ప్రయత్నించారు. కుమార్తెలిద్దరికీ చెరొక అర్ద ఎకరా పొలం రాయించి కుమారుడికి మిగిలిన ఆస్తి వారసత్వంగా వచ్చేలా చూస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆత్మహత్య వ్యవహారం బయటికి పొక్కనీయకుండా గ్రామ శివార్లలో మృతదేహాన్ని కాల్చేశారు. విషయం బయటికి పొక్కడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అర్బన్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తాలూకా ఎస్ఐ బాలమద్దిలేటి, చెన్నూరు ఎస్ఐ హనుమంతు తమ సిబ్బందితో ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు. భర్త, అత్త వేధింపులపై ఆరా తీశారు. పరారీలో ఉన్న భర్త, అత్త కోసం విసృ్తతంగా గాలిస్తున్నారు. మృతురాలి సోదరి లక్ష్మిదేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నకేశ్వరి భర్త సుబ్బరాయుడు, అత్త రామలక్షుమ్మపై కేసు నమోదు చేశారు.