‘ఏపీఎండీసీ ద్వారానే ఇసుక అమ్మకాలు’

Buggana Rajendranath Reddy Speech In West Godavari - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా కాంట్రాక్ట్  పనుల్లో అవినీతి జరిగిందని.. సిబ్బందికి కనీసం జీతాలు ఇవ్వకుండా నిధులను మళ్లించారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన జిల్లాలోని నర్సాపురం మండలం పీఎంలంక గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి బుగ్గన మీడియాతో మాట్లాడుతూ.. సంక్షేమ పథకాల కోసం ప్రభుత్వం నిధులు దుర్వినియోగం చేస్తోందన్న విపక్షాల ఆరోపణల్లో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. నేటి సంక్షేమ పథకాలే రేపు రాష్ట్రానికి పెట్టుబడులని.. ఏవి దూబరా పథకాలు కాదని ఆయన పేర్కొన్నారు.

గత ప్రభుత్వ పెండింగ్ బిల్లులు రూ. 60 వేల కోట్లు ఉన్నాయని అని దుయ్యబట్టారు. కాగా ఇప్పటి వరకు రూ. 20 వేల కోట్లు చెల్లించామని బుగ్గన గుర్తు చేశారు. శాఖలు, జిల్లాల వారిగా వివరాలు, పూర్తి సమాచారం సేకరించాకే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు. ఇసుక వల్ల రూ. వెయ్యి కోట్లు, మద్యం వల్ల రూ. 17,500 కోట్లు రాష్ట్రానికి ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాల్లో వృద్ధాప్య పింఛను, అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇసుక ర్యాంప్‌లకు కోసం వేలం పాటలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. ఏపీఎండీసీ ద్వారానే ఇసుక అమ్మకాలు నిర్వహిస్తామని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top