రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా? | botsa satyanarayana comments over AP cabinet reshuffle | Sakshi
Sakshi News home page

రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా?

Apr 2 2017 5:47 PM | Updated on Jun 2 2018 7:14 PM

రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా? - Sakshi

రాజకీయ వ్యభిచారానికి గవర్నర్ మద్దతా?

సీఎంగా చంద్రబాబు, గవర్నర్ గా నరసింహన్ పనికిరారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు.

విశాఖపట్నం: సీఎంగా చంద్రబాబు, గవర్నర్ గా నరసింహన్ పనికిరారని వైఎస్సార్ సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు రాజకీయ వ్యభిచారానికి పూనుకుంటే గవర్నర్ ఏవిధంగా సమర్థిస్తారని ప్రశ్నించారు. నరసింహన్ కు గవర్నర్ పదవిలో కొనసాగే హక్కులేదని అన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి ఆదివారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయించడం దారుణమన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన గవర్నర్.. ఫిరాయింపు ఎమ్మెల్యేలతో ఏవిధంగా ప్రమాణ స్వీకారం చేయిస్తారని ప్రశ్నించారు.

ఫిరాయింపు ఎమ్మెల్యేలపై రెండుమూడు పర్యాయాలు స్పీకర్‌ కు ఫిర్యాదు చేశామని.. న్యాయస్థానం, రాష్టప్రతిని ఆశ్రయిస్తామని తెలిపారు. చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడిచారని, దేశంలో ఎక్కడాలేనివిధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. చట్టం, రాజ్యాంగంపై ఆయనకు గౌరవం లేదని ధ్వజమెత్తారు. అప్రజ్వామిక చర్యలను ప్రజలు చూస్తూ ఊరుకోరని, మూల్యం చెల్లించుకోక తప్పదని బొత్స సత్యనారాయణ హెచ్చరించారు.

విశాఖ రైల్వే జోన్ కోసమే తమ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్‌ ఆత్మగౌరవ యాత్ర చేపట్టారని తెలిపారు. యాత్ర 9వ తేదీన ముగింపు సభకు వైఎస్ జగన్ హాజరవుతారని ప్రకటించారు. విశాఖ రైల్వే జోన్ ఇస్తామని విభజన చట్టంలో చెప్పారని గుర్తు చేశారు. ఆత్మగౌరవ యాత్రలో ప్రజలందరూ పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 30న గుడివాడ అమర్‌నాథ్‌ ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement