
అందాల అరకులో నాకో కాటేజ్!
ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకెంతో ఇష్టమైన అరకును.. అరకు కాఫీని ఓ మార్కెటింగ్ మేనేజర్లా ప్రమోట్ చేస్తున్నా.
* ఇక్కడి అందాలను చూస్తుంటే ఇల్లు కట్టుకుని ఉండాలనుంది
* దత్తత గ్రామం పెదలబుడు గ్రామస్తులతో సీఎం ముఖాముఖి
సాక్షి, అరకు: ‘ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నాకెంతో ఇష్టమైన అరకును.. అరకు కాఫీని ఓ మార్కెటింగ్ మేనేజర్లా ప్రమోట్ చేస్తున్నా. టూరిజం హబ్గా, ఎడ్యుకేషన్ హబ్గా అరకువ్యాలీని తీర్చిదిద్దుతా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. విశాఖ జిల్లా అరకులో మంగళవారం ఆయన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలతో పాటు పలు ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం స్థానిక ఎన్టీఆర్ గార్డెన్స్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ సభలో మాట్లాడుతూ అరుకులో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని, దీన్ని అధిగమించేందుకు యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేలా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా పెరల్ పార్కు ఏర్పాటు చేస్తానని చెప్పారు. అరకు అందాలను చూస్తే ఇక్కడే ఒక కాటేజీ కట్టుకుని ఉండాలని అనిపిస్తోందన్నారు. అరకును ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దేందుకు ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్తో పాటు ఇంజనీరింగ్, బీఈడీ, నర్సింగ్ కళాశాలలన్నీ ఏర్పాటు చేస్తానన్నారు. ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు లక్ష ఎకరాల్లో కాఫీ ప్లాంటేషన్ కోసం రూ.526 కోట్లతో ప్రాజెక్టు తీసుకున్నామన్నారు.
దత్తత పంచాయతీని సందర్శించిన సీఎం
అరకును అభివృద్ది చేయాలన్న లక్ష్యంతోనే ఈ మండలంలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నానని చంద్రబాబు చెప్పారు. తొలుత పెదలబుడు పంచాయతీకి వెళ్లిన చంద్రబాబు స్థానికులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.