‘మొక్కలను బాధ్యతగా సంరక్షించాలి’
మొక్కలు నాటిన ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్
సాక్షి, విజయవాడ: వనం-మనం కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మంగళవారం రాజ్భవన్ ప్రాంగణంలో ఏపీ గవర్నర్ బిస్వ భూషణ్ హరిచందన్ ఉసిరి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. కార్తీక మాసంలో ఉసిరి చెట్లకు పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోందన్నారు. దేశవ్యాప్తంగా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని చెప్పారు. మొక్కలను ప్రజలందరూ బాధ్యతగా సంరక్షించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. కాలుష్య రహిత సమాజాభివృద్ధికి ప్రజలు తమ వంతు సహకారాన్ని అందించాలన్నారు.