మాస్కులు పరిశీలించిన సీఎం జగన్‌ | AP Government Ready To distributes over 16 crore masks | Sakshi
Sakshi News home page

మాస్కులు పరిశీలించిన సీఎం జగన్‌

Apr 19 2020 3:21 PM | Updated on Apr 19 2020 6:20 PM

AP Government Ready To distributes over 16 crore masks - Sakshi

సాక్షి, తాడేపల్లి: మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు తయారు చేసిన మాస్కులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆదివారం ఆయనకు మెప్మా మిషన్‌ డైరెక్టర్‌ నవీన్‌ కుమార్‌ మాస్కులను అందచేశారు. స్వయం సహాయక సంఘాలు తయారుచేసిన మాస్క్‌లను ముఖ్యమంత్రి ప్రారంభించారు.  ఈ కార్యక్రమంలో సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డి, మెప్మా  అడిషనల్‌ డైరెక్టర్‌ శివపార్వతి పాల్గొన్నారు. (ప్రతి ఒక్కరికి మూడు మాస్కులు: సీఎం జగన్)

కాగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మూడు మాస్కులు చొప్పున 16 కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో... విపత్కర పరిస్థితుల్లోనూ మహిళలు తమ కుటుంబాలను పోషించుకునేందుకు అవకాశం కలిగింది. అయితే ఈ మాస్క్‌ల తయారీని కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా స్వయం సహాయక సంఘాల్లోని అక్కచెల్లెమ్మలకు అప్పగించాలని ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే మాస్కులకు అవసరమైన క్లాత్‌ను ఆప్కోనుంచి సేకరించాలని అధికారులు నిర్ణయించారు. మొత్తం 16 కోట్ల మాస్కులు తయారుచేయడానికి 1 కోటి 50 లక్షల మీటర్లకుపైగా క్లాత్‌ అవసరం అవుతోంది. ఇప్పటికే 20 లక్షలకు పైగా మీటర్ల క్లాత్‌ను ఆప్కో నుంచి తీసుకున్నారు. మిగతా క్లాత్‌ త్వరలోనే అందబోతోంది. (కరోనా నుంచి రక్షణకు సరికొత్త మాస్క్లు)

స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 40వేల మంది టైలర్లను గుర్తించారు. యుద్ధప్రాతిపదికన వారితో పనిచేయిస్తున్నారు. ఒక్కో మాస్క్‌కు దాదాపు రూ.3.50 చొప్పున సుమారు రూ.500లకుపైనే ప్రతి మహిళకూ ఆదాయం లభించేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నాటికి 7,28,201 మాస్క్‌లు తయారుచేయగా వీటిని పంపిణీ కోసం తరలిస్తున్నారు. వచ్చే 4–5 రోజుల్లో రోజుకు 30 లక్షల చొప్పున మాస్క్‌లు తయారీ కోసం సన్నద్ధమవుతున్నారు. మాస్క్‌ల తయారీ, పంపిణీలపై వివరాలతో కూడా రియల్‌టైం డేటాను ఆన్‌లైన్‌లో పెడుతున్నారు. (‘16 కోట్ల మాస్కులు తయారు చేసింది ఏపీ మహిళలే)

Advertisement
 
Advertisement
Advertisement