పలమనేరు జంట కానిస్టేబుళ్ల హత్య కేసుకు సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు.
చిత్తూరు: పలమనేరు జంట కానిస్టేబుళ్ల హత్య కేసుకు సంబంధించి పోలీసులు 8 మందిని అరెస్ట్ చేశారు. అందరూ తమిళనాడులోని సేలంకు చెందినవారే. వారిపై గతంలో 25 అత్యాచారాల కేసులు, 10 చోరీ కేసులు ఉన్నాయి. వీరి నుంచి మారణాయుధాలు, 3 బైక్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పలమనేరు సమీపంలోని గాంధీనగర్ అటవీ ప్రాంతంలో డిసెంబర్ 1న ఒక కానిస్టేబుల్, ఒక హొం గార్డు హత్యకు గురయ్యారు. గాంధీనగర్ అటవీ ప్రాంతం వైపు ఓ యువతిని ఆటోలో తీసుకెళ్తున్నారని అపరిచిత వ్యక్తి పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాడు. ఆ ఫోన్ కాల్ని కానిస్టేబుల్ మహేష్ అందుకున్నాడు. అతని పక్కనే ఉన్న మరో కానిస్టేబుల్ జవహర్లాల్ నాయుక్, హోంగార్డు దేవేంద్రకు సమాచారం అందించి ఘటనా స్థలానికి పంపాడు. ఆ తరువాత వారు తిరిగి రాలేదు. వారి సమాచారం తెలియలేదు. ఫోన్కు అందలేదు. తెల్లవారిన తరువాత వారి శవాలు కనిపించాయి. ఈ కేసును ఛేదించేందుకు స్థానిక పోలీసులతో పాటు ప్రత్యేక బృందాలు, ఎస్టీఎఫ్ బలగాలు తీవ్రంగా శ్రమించాయి. చివరికి 8 మంది నిందితులను అరెస్ట్ చేశారు.