
రాష్ట్రంలో 10 లక్షల ఫామ్పాండ్లు
‘వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకోవాలి. ఇందుకోసం ప్రతి రైతూ పొలంలో ఫామ్పాండ్లు నిర్మించుకోవాలి.
♦ ‘పంట సంజీవని’ పేరుతో నిర్మిస్తాం: సీఎం చంద్రబాబు
♦ రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘‘వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చుకోవాలి. ఇందుకోసం ప్రతి రైతూ పొలంలో ఫామ్పాండ్లు నిర్మించుకోవాలి. పంట సంజీవని పేరుతో రాష్ట్రంలో 10 లక్షల ఫారంపాండ్లు నిర్మిస్తాం. అనంతపురంలో లక్ష పూర్తిచేస్తాం. వీటినుంచి రెయిన్గన్ ద్వారా పొలాలకు నీళ్లిచ్చి పంటల్ని కాపాడతాం. ప్రతి ఎకరాకు నీరిస్తాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అనంతపురంలో మంగళవారం నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ రాష్ట్రస్థాయి సదస్సుకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్తో కలసి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో బాబు మాట్లాడారు.
ఇటీవల కురిసిన వర్షాలతో చిత్తూరులో భూగర్భజలాలు భారీగా పెరిగాయని, ఈ ప్రభావం ‘అనంత’లోనూ ఉందన్నారు. పంట సంజీవనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని, ఫామ్పాండ్ల నిర్మాణానికి ప్రభుత్వమే నిధులిస్తుందని తెలిపారు. ఒకప్పటి రతనాల సీమ ఇప్పుడు కరువుసీమగా మారిందని, అందుకే తాను దీన్ని సవాలుగా తీసుకున్నానని, మళ్లీ రతనాల సీమగా చేస్తానన్నారు. ‘హంద్రీ-నీవాను మూడునెలల్లో పూర్తి చే స్తాం. తద్వారా ప్రతి చెరువుకూ నీరిస్తాం. పోలవరం పూర్తి కావాలంటే నాలుగేళ్లు పడుతుంది. అందువల్లే పట్టిసీమను చేపట్టాం.
పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా 80 టీఎంసీల గోదావరి జలాల్ని కృష్ణాడెల్టాకిచ్చి, శ్రీశైలంలో పొదుపు చేసిన జలాల్ని రాయలసీమకిస్తున్నాం. డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ను అభివృద్ధి చేస్తాం. ‘అనంత’ కచ్చితంగా హార్టీకల్చర్ హబ్ అవుతుంది’’ అని చెప్పుకొచ్చారు. జలవనరుల వినియోగంపై ప్రజల్లో చైతన్యం కలిగేలా అనంతలో శాశ్వత మ్యూజియం ఏర్పాటు చేస్తామన్నారు. గవర్నర్ నరసింహన్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. రోజుకు 25 గంటలు పనిచేసే సీఎం ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ‘అనంత’తో తనకు ప్రత్యేక అనుబంధముందని గుర్తు చేసుకున్నారు. 45 ఏళ్లక్రితం ఇక్కడ ఉద్యోగ జీవితం ప్రారంభించానన్నారు.
అప్పుడు ‘అనంతపూర్’ను చూశా... ఇప్పుడు ‘అనంతపురము’ అయ్యింది అని అన్నారు. ఆర్నెల్లలో పదివేల ఫామ్పాండ్లు పూర్తి చేయాలని గవర్నర్గా కలెక్టర్ను ఆదేశిస్తున్నానన్నారు. ఆర్నెల్ల తర్వాత తానొస్తానన్నారు. అప్పుడు ‘అనంత సంతోషపురం’గా మారుతుందని, ఇక్కడ వలసలు ఆగి ఇతర జిల్లాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తారని ఆకాంక్షించారు. అంతకుముందు గవర్నర్ నరసింహన్ నీరు-ప్రగతి పైలాన్ను ఆవిష్కరించారు. ఎగ్జిబిషన్ను సందర్శించారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకల్ని గవర్నర్ చేతులమీదుగా పంపిణీ చేశారు.
అమరావతిలో అమిటీ యూనివర్సిటీ
రాజధాని అమరావతిలో అమిటీ యూనివర్సిటీ శాఖను ఏర్పాటు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో మంగళవారం అమిటీ యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ అతుల్ చౌహాన్ ప్రతినిధి బృందం సీఎంతో భేటీ అయ్యింది.