అత్తాపూర్: రోడ్డుపై అందరూ చూస్తుంగానే అత్తాపూర్లో మంగళవారం రాత్రి ఓ యువతిని దుండగులు కిడ్నాప్ చేశారని సోషల్ మీడియాలో వైరల్ అయింది. నలుగురు యువకులు నెంబర్ లేని థార్ కారులో జాయ్ హాస్పిటల్ వద్ద యువతిని బలవంతంగా తీసుకొని వెళ్లారని స్థానికులు 100 ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు కారును అత్తాపూర్ నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు వెంబడించే ప్రయత్నం చేయగా పరారయ్యారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. యువతి కిడ్నాప్ అయిందా? లేక వేరే కారణం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేశారు.
అమ్మాయి ఇంట్లోనే ఉంది
దర్యాప్తులో యువతి ఎవరనేది తెలిసిందని డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. ఐదు బృందాలుగా ఏర్పడిన పోలీసులు యువతి మలక్పేట్లోని ఇంట్లోనే ఉందని తెలుసుకున్నారన్నారు. జూబ్లీహిల్స్లో ఉన్న స్నేహితుడిని కలిసేందుకు వెళ్లిన సందర్భంగా గొడవ పడ్డారన్నారని... ఆ తరువాత క్యాబ్లో బయలుదేరగా అత్తాపూర్లోని జాయ్ అస్పత్రి వద్ద దిగిందన్నారు. అక్కడినుంచి స్నేహితులే కారులో తీసుకెళ్లారని వివరించారు. స్నేహితుల స్టేట్మెంటును నమోదు చేశామని తెలిపారు.


