రామ్ చరణ్ 'పెద్ది' విడుదలకు సిద్ధమైంది. వచ్చే నెల 4న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కానుంది. సోమవారం మధ్యాహ్నం ముంబైలో ట్రైలర్ లాంచ్ అయింది. ఈ కార్యక్రమంలోనే తన చేతికైనా గాయం గురించి రామ్ చరణ్ క్లారిటీ ఇచ్చాడు.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమాలు)
'చెయ్యి బాగానే ఉంది. బుచ్చిబాబు(దర్శకుడు) ఇచ్చిన బహుమతి ఇది. గత 25-30 రోజుల నుంచి కుస్తీ సన్నివేశాల షూటింగ్ చేశాం. ట్రైన్డ్ ఆర్టిస్టులని తీసుకురమ్మంటే నిజమైన పహిల్వాన్లని తీసుకొచ్చాడు. యాక్షన్ చెప్పగానే వాళ్లు బలంగా పట్టేసుకున్నారు. అందుకే చేతికి గాయమైంది. మణికట్టు దగ్గర ఎముక విరిగింది. 'పెద్ది'కి సంబంధించి ఇదో అందమైన జ్ఞాపకం' అని రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.
'పెద్ది' షూటింగ్ టైంలో మూడుసార్లు చరణ్ గాయపడ్డారు. కుస్తీ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో ఓసారి గాయపడగా.. రీసెంట్గా చేసిన చిత్రీకరణలో కంటికి, మణికట్టుకి గాయాలయ్యాయి. రెండు మూడు రోజుల్లో వాటికి సంబంధించి సర్జరీలు జరగనున్నాయని నిర్మాత చెప్పారు. అయితే మణికట్టుకి ఎలా గాయమైందని ఇప్పుడు చరణ్ స్వయంగా చెప్పాడు.
స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్.. క్రికెటర్, రెజ్లర్, రన్నర్గా కనిపించబోతున్నాడు. పల్లెటూరిలో ఉండే ఇతడు ఢిల్లీకి వెళ్లి కూలీపని ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ ప్రయాణంలో పెద్ది ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడనేదే స్టోరీలా అనిపిస్తుంది. ట్రైలర్లో మూవీ ఎలా ఉండబోతుందో చూపించారు గానీ స్టోరీపై పెద్దగా హింట్ ఇవ్వలేదు. బుచ్చిబాబు దర్శకుడు కాగా జాన్వీ కపూర్ హీరోయిన్. ఏఆర్ రెహమాన్ సంగీతమందించాడు.
(ఇదీ చదవండి: ఆటకూలీ పోరాటం.. 'పెద్ది'పైనే టాలీవుడ్ భారమంతా!)


