ఈ వారం ఓటీటీల్లోకి చాలానే సినిమాలు వచ్చాయి. వాటిలో లావణ్య త్రిపాఠి 'సతీ లీలావతి', తరుణ్ భాస్కర్ 'గాయపడ్డ సింహం' లాంటి స్ట్రెయిట్ చిత్రాలతో పాటు సిస్టమ్, మధువిధు, టీఎన్ 2026 తదితర డబ్బింగ్ మూవీస్తోపాటు 'మేం కాప్లం' అనే తెలుగు సిరీస్ కూడా స్ట్రీమింగ్లోకి వచ్చింది. వీటితో పాటు మరో మూడు తెలుగు సినిమా ఎలాంటి హడావుడి లేకుండా ఒకే ఓటీటీలోకి వచ్చేశాయి. ఇంతకీ అవేంటి? ఎందులో ఉన్నాయి?
(ఇదీ చదవండి: సీఎం విజయ్ని టార్గెట్ చేసి తీసిన సినిమా.. ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్)
గతేడాది జూలై 5న థియేటర్లలో రిలీజైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ సినిమా '14'. లక్ష్మీ శ్రీనివాస్ దర్శకుడు కాగా నోయల్ సీన్, రామ్ రతన్, విశాఖ ధీమాన్ ప్రధాన పాత్రలు చేశారు. ఇప్పుడిది ఆహా ఓటీటీలోకి వచ్చింది. ముఖ్యమంత్రి కొడుకు రతన్, జూనియర్ డాక్టర్ నేహా ప్రేమలో ఉంటారు. ఓ రోజు నేహా ఫ్లాట్లో ఇద్దరూ శవాలై కనిపిస్తారు. ఆత్మహత్య అని పోలీసులు తేలిస్తే.. సుబ్బు అనే జర్నలిస్ట్, తన మిత్రులతో కలిసి ఇది హత్య అని దర్యాప్తు చేస్తాడు. తర్వాత ఏమైందనేదే మిగతా స్టోరీ.
గతేడాది జూలై 19న థియేటర్లలోకి వచ్చిన 'రాజు గాని సవాల్' కూడా ఆహా ఓటీటీలోకి వచ్చింది. హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. లెలిజాల రవీందర్ దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ నటించాడు. చిన్న మొబైల్ రిపేర్ షాపు నడుపుకొనే రాజు అనే వ్యక్తి.. స్నేహితులతో కలిసి తన బస్తీలో గణేష్ ఉత్సవాలు చేయాలనుకుంటాడు. కానీ ఆ ఉత్సవాల వల్ల స్థానిక నాయకుడితో రాజుకు విభేదాలు వస్తాయి. ఈ క్రమంలోనే రాజు తన కుటుంబాన్ని, బస్తీని ఎలా కాపాడుకున్నాడనేదే మిగతా స్టోరీ.
గతేడాది సెప్టెంబరు 5న థియేటర్లలోకి వచ్చిన తెలుగు హారర్ కామెడీ సినిమా 'లవ్ యూ రా'. చిన్ను, గీతికా రతన్ జంటగా నటించారు. ఇందులో ప్రధానంగా స్నేహితుల మధ్య జరిగే పందెం, దాని చుట్టూ తిరిగే హారర్, నవ్వులు పుట్టించే అంశాలే ఈ మూవీ స్టోరీ. ఇది కూడా ఆహా ఓటీటీలోకి వచ్చేసింది.
(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ)


