మాజీ మిస్ పూణే ట్విషా శర్మ మరణం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నోయిడాకు చెందిన 33 ఏళ్ల ఈమె, డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన భోపాల్కు చెందిన న్యాయవాది సమర్థ్ సింగ్ను వివాహం చేసుకున్న తర్వాత, మే 12న అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆమె మృతిపై దర్యాప్తు కొనసాగుతుండగా..ట్విషా కుటుంబం, ఆమె అత్తగారి కుటుంబాల మధ్య ప్రత్యారోపణలు తీవ్ర స్థాయికి చేరాయి. అదీగాక ఈ విషాద ఘటనపై సినీ పరిశ్రమకు చెందిన పలువురు స్పందించారు కూడా.
తాజాగా ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా ఈ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేసుపై తీవ్రంగా స్పందించారు. ఆమె ఎక్స్ పోస్ట్లో ఇలా రాసుకొచ్చారు. కూతుళ్ల పట్ల భారతీయ కుటుంబాల మనస్తత్వంపై విమర్శలు గుప్పించారు. వాళ్లు కూతుళ్లను ఒక వస్తువుల్లా చూస్తారని, ముఖ్యంగా అత్తారింటికి పంపే సరుకులా చూస్తారని అన్నారామె. కన్యాదానం తర్వాత కూతురు అత్తగారింట్లో మృతి చెందడం గౌరప్రదం కదా అంటూ ఆక్రోశించారు. పెళ్లితోనే తల్లిదండ్రులు కూతుళ్లను తిరిగి తెచ్చుకోకూడని ఓ వస్తువులాంటి వారు కదా అని వ్యగ్యంగా మాట్లాడారు.
అలాగే బీజేపీ ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వెలుగుచూసిన వరకట్న వేధింపుల కేసులు, మరణాలపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రాంలో ఒక పోస్టు పెట్టారు. ఆ పోస్ట్లో వివాహానికి ముందే ఆర్థిక స్వాతంత్ర్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహిళలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిరోజూ పెళ్లైన యువతుల గురించి ఎన్నో విషాద వార్తలు వస్తున్నాయి.
పెళ్లైన ఈ యువ, విద్యావంతులైన మహిళల్లో చాలామంది, విషాదాలు జరగకముందే ఊపిరాడనంతటి క్లిష్ట పరిస్థితుల నుంచి బయటపడేయమని తమ తల్లిదండ్రులను వేడుకుంటున్నారు. కానీ భారతీయ సమాజం కూతుళ్లను పెళ్లయ్యాక వదిలేయడానికి ప్రసిద్ధి చెందింది. అందువల్ల ఎవరి మాట వినొద్దు..మీరు జీవితంలో స్థిరపడ్డాక పెళ్లి చేసుకోండి లేదంటే మిమ్మల్ని కాపాడటానికి ఎవరు ముందుకురారు అని యువతకు హిత బోధ చేశారామె.
(చదవండి: థాంక్యూ డియర్ పేరెంట్స్': ఒక తరం త్యాగ ఫలితమూ..)


