దేశ ఆర్థిక వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, పెరుగుతున్న దిగుమతి బిల్లులను అదుపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాల వైపు అడుగులు వేస్తోంది. వ్యయాల హేతుబద్ధీకరణ, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కీలక ఆదేశాలు జారీ చేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఆర్థిక సంస్థలు తక్షణమే కాఠిన్య చర్యలను అమలు చేయాలని స్పష్టం చేసింది.
ఆంక్షల పరిధిలోకి వచ్చే సంస్థలు ఇవే..
ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా మార్గదర్శకాలు విస్తృత స్థాయిలో ప్రభుత్వ ఆర్థిక రంగాన్ని కదిలించనున్నాయి. ముఖ్యంగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఇతర ప్రభుత్వ సాధారణ బీమా సంస్థలు, ఆర్థిక సేవల విభాగం పరిపాలనా నియంత్రణలో పనిచేసే అన్ని ఇతర ఆర్థిక సంస్థలు వీటి పరిధిలోకి రానున్నాయి.
విదేశీ పర్యటనలకు కోత..
కఠిన చర్యల్లో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థల అధిపతులకు డీఎఫ్ఎస్ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. విదేశీ ప్రయాణాలను నిర్ణీత పరిమితుల కంటే చాలా తక్కువగా ఉంచాలని పేర్కొంది. అత్యవసరమైతే తప్ప అంతర్జాతీయ పర్యటనలకు అనుమతించవద్దని, సాధ్యమైన ప్రతిచోటా భౌతిక పర్యటనల స్థానంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారానే సమీక్షలు, చర్చలు జరపాలని స్పష్టం చేసింది. దీనివల్ల భారీగా ప్రజాధనం ఆదా అవ్వడమే కాకుండా సమయం కూడా కలిసివస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఈవీ వైపు వేగంగా అడుగులు
వ్యాపార విస్తరణతో పాటు పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు ఈ సంస్థలు ఇకపై కీలక మార్పులు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న పెట్రోల్, డీజిల్తో నడిచే అద్దె వాహనాలను క్రమంగా పూర్తిగా తొలగించాలని ఆదేశించారు. వాటి స్థానంలో కాలక్రమేణా ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే వినియోగించేలా వ్యూహాత్మక చర్యలు తీసుకోవాలని డీఎఫ్ఎస్ ఆదేశించింది.
ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు!


