కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి మరో అత్యాధునిక వైద్య పరికరం అందుబాటులోకి వచ్చింది. ఈ 1000 ఎంఎ డ్యూయల్ డిటెక్టర్ డిజిటల్ రేడియో గ్రాఫిక్ సిస్టమ్ ద్వారా రోగులకు వేగవంతమైన వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎల్ఐసీ సంస్థ తన గోల్డెన్ జూబ్లీ ఫండ్ (జీజేఎఫ్) కార్యకలాపాల్లో భాగంగా రూ. 2 కోట్ల 21 లక్షలు వెచ్చించి రిమ్స్కు ఈ పరికరాన్ని అందజేసింది. ఎల్ఐసీ సౌత్ సెంట్రల్ జోన్, హైదరాబాద్ జోనల్ మేనేజర్ శరవణ రమేష్ ఈ పరికరాన్ని అందజేసి ప్రారంభించారు. ఎల్ఐసీ రీజినల్ మార్కెటింగ్ మేనేజర్ ఎఓ జీకేఆర్వీ రవికుమార్ రేడియోగ్రాఫిక్ సిస్టమ్ స్విచ్ ఆన్ చేశారు. ఎమ్మేల్యే మాధవి గౌరవ అతిధిగా హాజరైన ఈ కార్యక్రమంలో కడప ఎల్ఐసీ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎంవీకెఎస్ దుర్గా ప్రసాద్, అడ్మినిస్ట్రేటర్ యు.రంగస్వామి, రిమ్స్ సూపరింటెండెంట్ పెంచలయ్య, ఆర్ఎంవో శ్రీనివాసులు, రేడియోలజీ విభాగం హెచ్.వో.డి. శారద తదితరులు పాల్గొన్నారు.


