లింగాల : మండల కేంద్రమైన లింగాలలో శుక్రవారం దౌర్జన్యంగా చీనీచెట్లను దున్నేశారు. గ్రామానికి చెందిన రఘురామిరెడ్డి పొలంలోని చీనీచెట్లను నారాయణరెడ్డి అనే వ్యక్తి ట్రాక్టర్తో విచ్చలవిడిగా చీనీచెట్లపై తొక్కించుకుంటూ వెళుతూ సుమారు 15చీనీ చెట్లను తొక్కించాడు. 8 ఏళ్ల చీనీచెట్లు పంట చేతికొస్తుందన్న సమయంలో ఇలా దౌర్జన్యంగా తొక్కివేయడంతో సుమారు లక్ష రూపాయల దాకా నష్టం వాటిల్లిందని రైతు రఘురామిరెడ్డి తెలిపారు. చీనీచెట్లను తొక్కి వేయడమే కాకుండా తనపై దౌర్జన్యానికి దిగారని, తన టీవీఎస్ ద్విచక్ర వాహనాన్ని కిందపడేసి కాళ్లతో తొక్కి తనపై దౌర్జన్యం చేశాడని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎస్ఐ జగదీశ్వరరెడ్డి వివరణ కోరగా.. బాధిత రైతుకు న్యాయం చేస్తానని, బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశానన్నారు. అలాగే దౌర్జన్యానికి పాల్పడిన నారాయణరెడ్డిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రొద్దుటూరు క్రైం : భార్యను మానసికంగా, శారీరకంగా వేధిస్తూ ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో భర్తను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెకు చెందిన బైర గాని నాగమునేంద్ర తన భార్య నాగలక్ష్మి (33)ని కొంతకాలంగా మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడు. పుట్టింటి నుంచి డబ్బులు తీసుకురావాలని ఒత్తిడి చేయడంతోపాటు.. ‘చనిపోతే మరో వివాహం చేసుకుంటాను’ అంటూ తరచూ వేధించేవాడని దర్యాప్తులో వెల్లడైంది. భర్త వేధింపులు, అవమానాలు భరించలేక నాగలక్ష్మి గత నెల 11న ఇంట్లో విషపదార్థం సేవించింది. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 12న మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నమ్మకమైన సమాచారం మేరకు శుక్రవారం మీనాపురం రోడ్డులోని శ్రీనిధి మిల్క్ ఫ్యాక్టరీ సమీపంలో నాగమునేంద్రను అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని బాబా నగర్ వద్ద రైల్వే ట్రాక్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైనట్లు సీకే దిన్నె పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు 45–50 సంవత్సరాల మధ్య ఉంటుందన్నారు. మృతుడు నల్లని ఫ్యాంటు, తెల్లటి రెడీమేడ్ చొక్కా ధరించి ఉన్నట్లు తెలిపారు. నాలుగు రోజుల కిందటే మృతి చెందినట్లు చెప్పారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


