కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం నాగరాజుపేటలో శుక్రవారం తప్పిపోయిన చిన్నారిని అధికారులు తల్లికి అప్పగించారు. గాయత్రి అనే మూడేళ్ల చిన్నారి తప్పిపోవడంతో అధికారులు బాలల సంక్షేమ సమితిలో అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి బాలల సంక్షేమ సమితి వారిని కలిసి చిన్నారిని అక్కున చేర్చుకుంది. ఈ సందర్భంగా బాలిక తల్లి మాట్లాడుతూ తమది అన్నమయ్య జిల్లా ములకలచెరువు కాగా, భర్త కూలీ పనుల కోసం కడపకు రావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో భోజనం తీసుకు వచ్చేందుకు హోటల్కు వెళ్లగా చిన్నారి తప్పిపోయిందన్నారు. తన చిన్నారిని అప్పగించినందుకు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది.
కవల పిల్లల అదృశ్యం
మదనపల్లె టౌన్ : పట్టణంలోని అనపగుట్టకు చెందిన మోహన్, రాణి దంపతుల కవల పిల్లలు సందీప్ (14), సుశాంత్ (14) అదృశ్యమయ్యారు. గత నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదు. బంధువులు, పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి తల్లి రాణి పోలీసులను ఆశ్రయించారు.


