కడప అర్బన్: కడప నగరంలోని మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని పెద్ద దస్తగిరి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారనీ, ఆయన రాజకీయ ఎదుగుదల చూడలేకనే కూటమి ప్రభుత్వం పెద్దలు కుట్ర పన్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ ధ్వజమెత్తారు. ఈనెల 12 వ తేదీన పోలీసులు బండి నిత్యానందరెడ్డిని కడప కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్కు తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో వున్న నిత్యానందరెడ్డిని శుక్రవారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప నగర మాజీ మేయర్ పాకా సురేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం వారు కడప కేంద్ర కారాగారం బయట విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్న క్రమంలోనే నిత్యానందరెడ్డిని పెద్దదస్తగిరి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఆయన న్యాయపోరాటం చేసేందుకు పార్టీ నేతలు అండగా ఉంటామన్నారు. నిజానిజాలను తెలుసుకోకుండా ఈ విధంగా వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి తన భర్తతో ములాఖత్ అయి వెళ్లారు.
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకాసురేష్


