పులివెందుల రూరల్: బయట ఎండకు తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు కుండలోని గ్లాసు నీరు తాగితే దప్పిక తీరడమే కాదు.. ప్రాణమూ కుదుటపడుతుంది.. అవును.. ప్రిడ్జ్లోని ఐస్ నీరు కంటే మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్నారు వైద్య నిపుణులు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్న వారు సైతం మట్టి కుండలను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మట్టి కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో మట్టి కుండల విక్రయాలు రోజుకు వందల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఒక్కో కుండ సైజును బట్టి రూ.150ల నుంచి రూ.200ల వరకు విక్రయిస్తున్నారు. కుళాయి అమర్చిన కుండలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
గుజరాత్ రాష్ట్రం నుంచి కుండల దిగుమతి
గుజరాత్ రాష్ట్రం నుంచి జామ్ అనే కొత్త కుండలను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు. వేసవి కాలంలో ఈ కుండలకు మంచి డిమాండ్ ఉంది. గుజరాత్కు చెందిన జాబ్ కుండలు ఒక్కొక్కటి రూ.200ల నుంచి రూ.300ల వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. అలాగే కర్నూలు, కడప, కమలాపురం, మదనపల్లె తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని స్థానికంగా విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
కుండనీళ్లు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్న వైద్య నిపుణులు
వేసవికాలంలోనే కుండలకు గిరాకీ


