కడప కార్పొరేషన్ : పేద ప్రజల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలపై ఈనాడు పత్రిక విషపు రాతలు రాయడం తీవ్ర అభ్యంతరకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, వైద్య విభాగం సభ్యులు పెంచలయ్యలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రిమ్స్ ఆసుపత్రిని నెలకొల్పారన్నారు. జిల్లా వ్యాప్తంగా మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో 2007వ సంవత్సరం నుంచి పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి రోగులు, వారి సహాయకుల ఆకలి తీరుస్తున్నారన్నారు. రోజుకు 700 నుంచి 800 పేద ప్రజలకు మెరుగైన భోజన వసతులు కల్పించి, 19 ఏళ్లుగా ప్రతినెలా రూ.7లక్షల చొప్పున ఇప్పటి వరకూ రూ.1.33 కోట్లు సొంత నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. 2007లో అప్పటి కలెక్టర్ రిమ్స్ బయట ట్రస్ట్కు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తామని తెలిపినా సున్నితంగా తిరస్కరించి, సొంత నిధులతో బిల్డింగ్ నిర్మించి సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు. ఈ మధ్య అక్కడున్న మేనేజర్, వంటవారు పొరపాట్లు చేస్తూ రోగులకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని పచ్చ మీడియా రోత రాతలతో అసత్యమైన ఆరోపణలతో ఎటువంటి వివరణ తీసుకోకుండా వార్తలు రాయడం దుర్మార్గమన్నారు.
వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి
కిశోర్ బూసిపాటి


