పులివెందుల : చంద్రబాబు నాయుడు అబద్ధానికి రెక్కలు కట్టడంలో దిట్ట అని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు చేసిందేమి లేదని, కేవలం తన ఆర్థిక అభివృద్ధి కోసం అమరావతిని అడ్డుపెట్టుకున్నారన్నారు. అమరావతి పేరుతో రూ.2లక్షల కోట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడన్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ సంక్షోభానికి కూడా చంద్రబాబే కారణమన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంకంటే, రాష్ట్ర ప్రజలకు మంచి చేయడం కంటే తన అభివృద్ధి కోసం చంద్రబాబు పనిచేస్తున్నాడన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు తమ ఆదాయం కోసం అనేక అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారన్నారు. ప్రజలకు మంచి చేయడం కంటే ప్రజా ధనాన్ని ఎలా దోచుకోవాలో తెలుగుదేశం పార్టీ చూపిస్తోందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
● వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉద్యో గ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలే ప్రధాన డిమాండ్ గా మే 6 తేదీ విజయవాడలోని ధర్నా చౌక్ లో తలపెట్టిన మహా ధర్నా విజయవంతం చేయాలనే లక్ష్యంతో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. విజయవాడలో మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం మంచి పరిణామమని, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో వైఎస్సార్ టీఏ ముందుండాలని అన్నారు. అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథ్ రెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు అమరనాథరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో వైఎస్సార్ టీఏ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
శనగల డబ్బులు చెల్లించలేదు :
గురువారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని పలువురు రైతులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో శనగలు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసి వారి అకౌంట్లలో డబ్బులు వేయకపోవడం అన్యాయమన్నారు. అలాగే జిల్లాలో మొక్కజొన్న, వరి రైతులకు కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తెచ్చినా కూడా ప్రభుత్వం స్పందించలేదన్నారు.
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి


