సింహాద్రిపురం : సింహాద్రిపురంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో కారు అదుపు తప్పి అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు.
హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్టు
రాజంపేట: మండలంలోని కొత్తబోయనపల్లెలో ఉన్న ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద ఈనెల 8న ఎర్రబల్లి గ్రామానికి చెందిన కడిమెల్ల గిరిధర రాజాపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే తెలిపారు. ఎస్డీపీఓ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘర్షణకు సంబంధించి మొత్తం 11 మంది నిందితులను గుర్తించామన్నారు. వారిలో ఇద్దరు కోర్టులో సరెండరయారని,. ప్రస్తుతం మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు చేసిన వారిలో చాగలమర్రిమండలానికి చెందిన ఆలమూరు వెంకటకార్తీక్ రెడ్డి, గుత్తి మండలానికి చెందిన గడ్డెం ఎర్రి స్వామిలు ఉన్నారని వివరించారు. గిరిధర్రాజుపై జరిగిన హత్యయత్నం కేసులో వీరు ప్రముఖపాత్ర పోషించారన్నారు. మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. పీజీ హాస్టల్ల్లో ఉంటున్న విద్యార్ధులపై యజమానులు నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం పీజీ హాస్టల్స్ యజమానులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు.సమావేశంలో మన్నూరు సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక శ్లోక పాఠశాల రహదారిలో ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు అఖిల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి రెండు తులాలు, వెండి వస్తువులు, రూ.50వేల నగదును అపహరించినట్లు తెలిపారు. స్థానిక మదీనాపురానికి చెందిన షేక్ అఖిల కడప కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి చెందిన సీసీ కెమెరాల కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భర్త ఇటీవల మృతి చెందాడు. ఈమె శ్లోక పాఠశాల సమీపంలోని జిమ్మి చెట్టు వద్ద నివాసం ఉంటోంది. తన తల్లి ఇంటి వద్ద పిల్లలను వదిలి శుక్రవారం డ్యూటికి వెళ్లింది. శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తాళాలు పగులగొట్టి ఉన్న విషయం బయటపడటంతో తల్లిని పిలిపించి ఇంట్లోకి వెళ్లింది. బీరువాను పగుల కొట్టి బంగారు, వెండి వస్తువులతోపాటు డబ్బాలో ఉన్న రూ.50వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. నగదు ఉన్న డబ్బాను ఇంటి బయట వేసి వెళ్లినట్లు తెలిపారు. దాదాపు రూ.5లక్షల వరకు నష్టం కలిగినట్లు వాపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. షేక్ అఖిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి
గాలివీడు: మండలంలోని గరుగుపల్లె పంచాయతీ పరిధిలోని ఇడపన్ చేనుపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటలను అడవి జంతువుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది.గ్రామానికి చెందిన పందికుంట సాయికుమార్ రెడ్డి (19) తన సొంత పొలంలోని వేరుశనగ పంట వద్ద విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు కథనం మేరకు ప్రతిరోజూ పంట కాపలాకు తండ్రి ఇరగం రెడ్డి లేదా తల్లి ఆకులమ్మ వెళ్లేవారు.ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సంఘటన జరిగిన రోజు సాయికుమార్ రెడ్డి తన తండ్రికి భోజనం తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించలేదు.ముందుకెళుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తండ్రి ఇరగం రెడ్డి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు.


