కడప సెవెన్రోడ్స్ : డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ విధానాన్ని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. ఈ స్మార్ట్ కిచెన్ విధానం ఒక మోడల్గా ఉంటూ.. మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్కోచ్ అవార్డు ఇండియాస్ హానెస్ట్ ఇండిపెండెంట్ హానర్కు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం న్యూ ఢిల్లీ లోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన 106 వ స్కోచ్ సమ్మిట్ అవార్డు ప్రదాన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తరపున స్కోచ్ అవార్డును జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్, స్టెప్ఈఓ విజయ్ కుమార్ అందుకున్నారు.
వ్యక్తిపై హత్యాయత్నం
చక్రాయపేట : మండలంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన తేల్లూరు చిన్నరాముడుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. తన పొలంలోని వేరుశనగ పంటకు అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు రాత్రిపూట కాపలా నిమిత్తం వెళతాడు. గురు, శుక్రవారాల్లో కూడా కాపలా వెళ్లాడు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంపకు నిప్పు పెట్టడమేకాక తనపై రాళ్లు కూడా వేశారని బాధితుడు తెలిపాడు. గురువారం రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడున్నారు. ఈ విషయంపై చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు.


