కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. జట్టులోని ప్రణవ్రెడ్డి 46, రణధీర్రెడ్డి 41 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, మల్లికార్జున 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 35.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. జట్టులోని కెహెచ్ వీరారెడ్డి 84, ప్రశాంత్ 31 పరుగులు చేశారు. కడప జట్టులోని మహ్మద్ ఆయూబ్ 3, ప్రణవ్రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 3 వికెట్ల తేడా విజయం సాధించింది.
● కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–కర్నూలు జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆ జట్టులోని య్యద్ షాహుల్ హామీద్ 80 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. మన్విత్ కుమార్ రెడ్డి 71, తోషిత్ యాదవ్ 51 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని అశోక్ కుమార్ యాదవ్ 2, సాయి సూర్యతేజ రెడ్డి 2 తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 43.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని నయిముల్లా 50, హృదయ్ 37 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ 2, తోషిత్ యాదవ్ 2, అఖిల్ 2 అశోక్ 2 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 134 తేడాతో ఘన విజయం సాధించింది.


