గోపవరం : బద్వేలు రూరల్ స్టేషన్ పరిధిలో చంపుతామని కత్తితో బెదిరించి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తు, కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య తెలిపారు. ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీరామనవమి పండుగ రోజున రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయిన ఘటనపై కేసు నమోదు చేసి రూరల్ సీఐ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా అందిన సమాచారం మేరకు ఆదివారం మండలంలోని ద్వారకానగర్ సమీపంలోని గరుడయ్యసత్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మార్కాపురం టౌన్కు చెందిన షైక్ఈసుమీరావల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు.
నేరచరిత్ర, ముఠా వివరాలు
మీరావల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్లాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేష్ అనే కరుడుకట్టిన పాతనేరస్తులతో పరిచయం ఏర్పడి ఈ నలుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి జనం ఎక్కువ ఉన్న చోట మహిళలు నగలు వేసుకుని ఉంటారని, ఆ ప్రదేశాలను దొంగతనాలకు ఎంచుకుని ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికై నా సిద్ధపడాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం కత్తులు కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీరందరూ ఈ నెల 25వ తేదీన పొదిలి సమీపంలో ఒక డీలక్స్ బైక్, 26వ తేదీన నరసారావుపేటలో మరో బైక్, పామూరు సమీపంలో పల్సర్ బైక్ దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి ఆమె మెడలో ఉన్న రూ.2.50 లక్షలు విలువైన బంగారు గొలుసును దొంగిలించడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడి నుండి బంగారు గొలుసుతో పాటు కారు, ద్విచక్ర వాహనాలు, కత్తులు స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రూరల్ ఎస్ఐ రంగారావు, బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేసి 48 గంటల్లోనే అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టు రట్టుచేసి వారి నుండి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం పట్ల మైదుకూరు డీఎస్పీ రాజేందప్రసాద్ సీఐ క్రిష్ణయ్య, ఎస్ఐలను అభినందించారు. అరెస్టు చేసిన నిందితుడిని రిమాండ్కు తరలించామని, ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఎస్ఐ రంగారావు తెలిపారు.
ఒకరు అరెస్టు


