● ఆలయంలో ప్రొటోకాల్ తప్పారా..!
● టీడీపీ నేత పట్టువస్త్రాల సమర్పణపై అభ్యంతరాలు
● నోరు మెదపలేకపోతున్న ఆలయ అధికారులు
రాజంపేట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన నాయకుడు.. వార్డు మెంబరు కాదు.. సర్పంచి కాదు.. ఎంపీపీ కాదు.. ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. రాజంపేట టీడీపీ ఇన్చార్జిగా ఉన్న చమర్తి జగన్మోహన్రాజుకు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పట్టం కట్టిందనే విమర్శలను మూటకట్టుకుంది. టీటీడీ ప్రొటోకాల్ పాటించే విషయంలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తుంది. ఇప్పుడు రామయ్య సన్నిధిలో టీటీడీ ప్రొటోకాల్ తప్పిందన్న విమర్శలు వెలువడ్డాయి. ఆలయ అధికారులు జీ హుజూర్ అని టీడీపీకి దాసోహమన్నారా? అన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీరామనవమి రోజున స్వామివారికి టీడీపీ నేత పట్టువస్త్రాలను తీసుకెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ముఖ్యనేతలు ఉన్న వారికి కూడా ఈ సంప్రదాయాన్ని వర్తింపచేయాలి కదా అని కూటమి వర్గాల నుంచి భిన్నస్వరం వినిపిస్తోంది.
అధికారులూ.. ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్త..
ప్రొటోకాల్ విషయంలో ఉన్నతాధికారులు, అధికారులు జాగ్రత్తగా మసులుకోకపోతే రిటైర్ అయినా పింఛన్ నిలిపివేత, సస్పెండ్, ఉద్యోగం ఊస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవాలని మేధావి వర్గాలు హితువు పలుకుతున్నారు. ఒక రాజంపేట నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి అధికారగణం ప్రొటోకాల్ పాటించడం లేదన్న ఆరోపణలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు ప్రొటోకాల్ తప్పితే సంబంధిత ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు రిటైర్డ్ అయినా విధి నిర్వహణలో ప్రొటోకాల్ తప్పినందుకు ఆయనను ప్రొటోకాల్ తప్పిద శాపం వెంటాడుతున్న సంగతి విదితమే. పింఛన్ కూడా నిలిపివేశారని తెలిసింది. ప్రొటోకాల్ విషయంపై వివరణ అడగడానికి ‘సాక్షి’ విలేకరులు ఫోన్ చేయగా.. టీటీడీ అధికారులు లిఫ్ట్ చేయలేదు.


