ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తుండగా అంజి(44) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తున్న అంజి అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100582, 9121100581 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు.
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు
కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు చికిత్స కోసం వేర్వేరు రోజుల్లో వచ్చిన ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వేర్వేరు సమయాలలో మృతి చెందారు. వారి మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు.
అగ్నిప్రమాదంలో భారీ నష్టం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని గీతాశ్రమం వీధిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం సంభవించింది. ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో భారీ నష్టం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణపాటి రాధమ్మ ఇంట్లోని వరండాలో ఉన్న కూలర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగి ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు, ఫర్నీచర్, టీవీ పూర్తిగా కాలిపోయాయి. అయితే మంటలను అదుపు చేసేలోగా పక్కన ఉన్న కామిశెట్టి రమాదేవి ఇంట్లోకి వ్యాపించాయి. ఈ ప్రమాదం ధాటికి గ్రైండర్, ఓవెన్, టీవీ, దుకాణానికి సంబంధించిన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అలాగే పెద్ద మొత్తంలో డబ్బు, గోధుమ పిండి, బియ్యం బస్తాలు, ఇంటి పైకప్పు, స్లాబ్ దంతెలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రెండు ఇళ్లలోనూ సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు.


