కడప అగ్రికల్చర్ : జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణను అమలు చేయాలని జాయింట్ ఫోరం ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కడప డీసీసీ బ్యాంకు ఎదుట ప్లకార్డులతో నాయకులు, ఉద్యోగులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జాయింట్ ఫోరం ఆప్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు గంటా నారాయణరెడ్డి, సుధీర్రెడ్డి, రాజేంద్ర ప్రసాద్రెడ్డి, సుధాకర్రెడ్డిలు మాట్లాడుతూ 40 నెలల కాలం పూర్తవుతున్నా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పనిచేస్తున్న 3,500 ఉద్యోగులకు వేతన సవరణ అమలులో జాప్యం జరుగుతోందన్నారు.ఇందుకు నిరసనగా ఏప్రిల్ 4 నుంచి జిల్లాల వారీగా విజయవాడ ఆప్కాబ్ కేంద్ర కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. అప్పటికి యాజమాన్యం సానుకూలంగా స్పందించకపోతే ఏప్రిల్ 13న రాష్ట్రవ్యాప్త సమ్మె నిర్వహిస్తామని హెచ్చరించారు.
వైద్య కళాశాలను అభివృద్ధ్ది పథంలో నడిపించాలి
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన కొత్త ఏపీ జూడా (ఏపీజెయుడీఏ) కమిటీ నాయకులు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. వీరు కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.జమునను కలిశారు. ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ కడప ప్రభుత్వ వైద్య కళాశాలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. ఏపీ జూడాల కడప జిఎంసీ కమిటీలో డాక్టర్ ఎం. రవితేజ నాయక్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ బి. యశ్వంత్ కృష్ణ, డాక్టర్ కె. మేఘనా ప్రధాన కార్యదర్శులుగా వ్యవహరిస్తున్నారు. ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఎ. లక్ష్మికాంత్, డాక్టర్ జి. తిరుమలేష్, డాక్టర్ ఎన్. ఎస్. మిహిర్ రెడ్డి, డాక్టర్ బి. దినేష్ విశ్వ రెడ్డి, డాక్టర్ దీపిక ఉన్నారు.


