● నిత్యావసర వస్తువుల నిల్వలో తేడా
● విజిలెన్స్ అధికారులు దాడులు
ప్రొద్దుటూరు : అధికార పార్టీకి చెందిన టీడీపీ నాయకుడు కాంట్రాక్టర్ ముసుగులో బియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నాడు. అధికార పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ తనయుడు పౌరసరఫరాల శాఖ గోడౌన్లో స్టేజ్–2 కాంట్రాక్టర్గా ఉన్నాడు. ఈయన ప్రతినెల గోడౌన్ నుంచి రేషన్ షాప్లకు తన వాహనాల ద్వారా బియ్యంతోపాటు నిత్యావసర సరుకులను సరఫరా చేస్తుంటాడు. ప్రొద్దుటూరులో బియ్యం వ్యాపారం రేషన్ షాపుల్లో బహిరంగంగా జరుగుతోంది. నేరుగా డీలర్లు కార్డుదారుల నుంచి బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కాగా సదరు కాంట్రాక్టర్ ముందుగానే తనకు అనుకూలమైన డీలర్లతో మాట్లాడుకుని తక్కువగా బియ్యాన్ని రేషన్ షాపులకు తరలిస్తున్నారు. మిగిలిన బియ్యం బస్తాలను గోడౌన్ నుంచే బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నట్లు సమాచారం. ఇందుకు అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే గోడౌన్ నుంచి రేషన్ షాపులకు నిత్యావసర వస్తువులను కాంట్రాక్టర్ సరఫరా చేశారు.
విజిలెన్స్ అధికారుల దాడులు
రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి కరీముల్లా షరీఫ్ ఆదేశాల మేరకు బుధవారం స్థానిక పౌరసరఫరాల శాఖ గోడౌన్ను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు తనిఖీలు నిర్వహించి వివరాలను ప్రకటించారు. బియ్యం 50.2 క్వింటాళ్లు, చక్కెర 43 క్వింటాళ్లు, జొన్నలు 7 క్వింటాళ్లుతోపాటు ఇతర సరుకులు తక్కువగా ఉన్నట్లు ధ్రువీకరించారు. సీఐ పి.శ్రీనివాసరెడ్డి, డీసీటీఓ ఎస్.ఖాజాహుస్సేన్, డీఈఈ ఈశ్వరయ్యతోపాటు గోడౌన్ ఇన్చార్జి లింగస్వామి పాల్గొన్నారు.


