పులివెందుల టౌన్ : పట్టణంలోని కదిరి రోడ్డులో ఆటోలో వెళుతున్న 11బస్తాల రేషన్ బియ్యాన్ని సోమవారం ఎన్ఫోర్స్మెంట్ డీటీ సుధీర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమార్కులు కదిరికి తరలిస్తుండగా సమాచారం రావడంతో ఆటోను పట్టుకున్నామన్నారు. పట్టుకున్న బియ్యాన్ని పంచనామా నిమిత్తం గోదాముకు తరలించామన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు చోరుల అరెస్ట్
రాజంపేట: రాజంపేట మండలం ఎర్రబల్లిలో ఫిబ్రవరి 6న తాళం వేసిన ఇంట్లో జరిగిన చోరీ కేసును మన్నూరు పోలీసులు చేధించారు. ఈమేరకు సోమవారం ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే వివరాలను విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. ఈ చోరీకి సంబంధించి దొంగలు తమిళనాడుకు చెందిన మాబాషా, సాయికుమార్లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.9లక్షల విలువైన వంద గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. చోరీ కేసుల పట్టుబడిన దొంగలపై పలు కేసులు ఉన్నట్లు ఏఎస్పీ తెలిపారు. సమావేశంలో సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు, మన్నూరు పోలీసులు పాల్గొన్నారు.
కానిస్టేబుల్ వీరంగం
కడప అర్బన్: తన భార్యను వేధిస్తున్న కేసులో సస్పెన్షన్కు గురైన కానిస్టేబుల్ విల్ఫ్రెడ్ ఈ నెల 22వ తేదీ రిమ్స్ పీఎస్ పరిధిలో శివానందపురంలో తన స్నేహితుని ఇంటికి వెళ్లి ఆగ్రహావేశంతో ఊగిపోయాడు. తీవ్రస్థాయిలో తన స్నేహితుడు, అతని కుటుంబసభ్యులను దూషించాడు. తరువాత కోపంతో ఊగిపోతూ తన స్నేహితుడి కుటుంబసభ్యులకు సంబంధించిన కారు, స్కూటీని ధ్వంసం చేశాడు. అలాగే ఇంటికి అమర్చిన అద్దాన్ని కూడా పగులగొట్టాడు. తన భార్య, పిల్లలు తన స్నేహితుని ఇంట్లోనే ఉన్నారని భావించి ఈ విధంగా వీరంగం సృష్టించినట్లు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు విల్ఫ్రెడ్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రిమ్స్ పీఎస్ పోలీసులు తెలిపారు.


