కడప అర్బన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రంజాన్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు. స్నేహితులతో కలిసి వెళ్లి బావిలో మునిగి ప్రాణాలు వదిలిన సంఘటన కడప నగరం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రిమ్స్ పోలీసుల వివరాల మేరకు.. కడప బీడీ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్ (28) తన తండ్రితోపాటు తిరుపతిలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బుడ్డాయిపల్లె వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లి ఈత కొట్టాడు. కొద్దిసేపటికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
వాహనం ఢీకొని
గుర్తుతెలియని వ్యక్తి మృతి
రాజంపేట : కడప–తిరుపతి బైపాస్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున జీకేఎస్ఆర్ కల్యాణ మండపం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందారు. మృతుడి వద్ద ఎటువంటి ఆధారాలు లేవు. ఆచూకీ గుర్తించిన వారు టౌన్ సీఐ 9121100569, ఎస్ఐ 9121100570 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పట్టణ పోలీసులు తెలిపారు. మృతుడి సంబంధీకులు పట్టణ పోలీసుస్టేషన్లో సంప్రదించాలని వివరించారు.
రిమ్స్ మార్చురీలో
ఇద్దరి మృతదేహాలు
కడప అర్బన్ : కడప నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈ నెల 13వ తేదీన ఒకరు, ఈనెల 18న మరొకరు చికిత్స కోసం చేరారు. వీరు మృతి చెందడంతో మృతదేహాలను మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు పేర్కొన్నారు.
పండగ రోజు ఈతకెళ్లి యువకుడు మృత్యువాత


