చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో అవినీతి తాండవం ఆడుతోందని ఆలయ మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు ఆరోపించారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. గండిలో అర్చకులకు అక్రమ సంపాదనే పరమావధిగా మారిందని చెప్పారు. ఇందుకోసం దేవుడికి వేసిన పూలమాలలు తిరిగి దుకాణాలకు అమ్ముకొంటున్నారని మండిపడ్డారు. హారతి పల్లెం డబ్బు హుండీలో వేయకుండా కాజేసి ఆలయ ఆదాయానికి రూ.కోట్లలో గండి కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ ప్రాంగణంలో తాయత్తులు విక్రయించాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవన్నారు. అలాంటిది తాయత్తులు ఎలా విక్రయిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ హారతి పల్లెం డబ్బులు తింటూ కోట్లకు పడగలెత్తిన ఆలయ అర్చకుడిపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చివరికి గుడిలో స్వామి వారికి నైవేద్యం పెట్టకుండా ఎగర గొట్టారంటే ఇంతకంటే అపచారం ఏముంటుదని ఆవేదన వ్యక్తం చేశారు. వాహనాలకు, ఆకుపూజ తదితర పూజల నిమిత్తం గండికి వచ్చిన భక్తులు టికెట్టు తీసుకున్నా కూడా అదనంగా డబ్బు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఈ పరిస్థితి మాజీ చైర్మన్ అయిన తనకు, తన కుటుంబ సభ్యులకే ఎదురయ్యిందని చెప్పారు. ఇక సామాన్య భక్తుల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదని తెలిపారు. గురు,శుక్రవారాల్లో ఆలయంలో జరిగిన సంఘటనలపై తగిన చర్యలు తీసుకోవాలని దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, గండి ఆలయ బాధ్యతలు నిర్వహిస్తున్న గురుప్రసాద్ను ఫోన్ ద్వారా కోరినట్లు చెప్పారు. గండి అక్ర మాలపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులచే సమగ్ర విచారణ జరపాలని ఆయన కోరారు.
ఆలయ మాజీ చైర్మన్ వడ్లకుంట రాజారావు


