కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీపీజీసెట్ (APPGCET)–2026 దరఖాస్తు గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ్చఞ. జౌఠి. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సందేహాల కోసం 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించవచ్చు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఉచితంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు.
కడప అర్బన్: కడపనగరంలోని కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో ఉన్న జల వనరుల శాఖ డీఈఈ వేణుగోపాల్ రెడ్డిపై దాడి చేసిన జూనియర్ అసిస్టెంట్ ప్రణీత్ రెడ్డి పై కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు ఈనెల 17వ తేదీ జల వనరుల శాఖ కార్యాలయంలో ఆడిట్ తనిఖీ జరుగుతుండగా జూనియర్ అసిస్టెంట్తో ఈ– బుక్ తేవాలని సూచించడంతో ఆయన కోపంతో దూషించడంతోపాటు గాయపరిచినట్లు తెలిపారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
లింగాల: మండలంలోని అక్కులగారిపల్లెలో రైతు నరాల ఉదయ్ కృష్ణారెడ్డి సాగు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ పొలాలను లండన్ శాస్త్రవేత్త డాక్టర్ నటాషా ఎడ్వార్డ్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ప్రకృతి వ్యవసాయ వనరుల కేంద్రాన్ని పరిశీలించి, అక్కడ తయారయ్యే కషాయాలు, ద్రావణాలు, గ్రోత్ ప్రమోటర్స్, బయో ఎంజైమ్స్ మరియు వర్మీ వాష్ తయారీ విధానాలను అడిగి తెలుసుకున్నారు. ప్రకృతి సిద్ధమైన ఈ కషాయాలను ఎంత విస్తీర్ణానికి, ఏ మోతాదులో పిచికారీ చేయాలో రైతును అడిగి తెలుసుకున్న డాక్టర్ నటాషా, విత్తన గుళికల తయారీ మరియు వాటి ఉపయోగాలు, పీఎండీఎస్ సాగు పద్ధతులపై ప్రత్యేక ఆసక్తి కనబరిచారు. ఈ వివరాలను డాక్టర్ పుష్ప ఇంగ్లీష్లోకి అనువదించి శాస్త్రవేత్తకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ డివిజనల్ అధికారి భాస్కర్రెడ్డి, మండల ఇన్ఛార్జ్ జయ నాయక్, డీఎంఎంటీ యామినిలత పాల్గొన్నారు.
మదనపల్లె సిటీ: స్థానిక నీరుగట్టువారిపల్లెలోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ఉట్ల తిరునాల నిర్వహించారు. ఆలయం ఎదుట ప్రాంగణంలో ఉట్ల మాను ఏర్పాటు చేశారు. యువకులు ఎంతో ఉత్సాహంగా ఉట్ల మాను ఎక్కేందుకు ముందుకు వచ్చారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఉట్లమాను కొందరు యువకులు ఎక్కి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఉదయం ఆలయంలో చౌడేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు.
కడప వైఎస్ఆర్ సర్కిల్: భగత్ సింగ్ వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 23న కడప నగరంలో నిర్వహించనున్న ‘అమరవీరుల దినోత్సవం’ కార్యక్రమాలకు సీపీఐ జాతీయ నాయకులు డాక్టర్ కె. నారాయణ, ముప్పాళ్ళ నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి చంద్ర ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23న సాయంత్రం కోటిరెడ్డి సర్కిల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం, అక్కడి నుంచి ఏడు రోడ్ల కూడలి వరకు భారీ ‘కాగడాల ప్రదర్శన’ నిర్వహిస్తామన్నారు. అలాగే, పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు, సాగు భూమి సాధన కోసం సీపీఐ చేపట్టిన రాష్ట్రవ్యాప్త ఆందోళనలో భాగంగా.. 24న బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నిరసనలో రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి. హరినాథ్ రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం 25న బద్వేల్లో జరిగే జిల్లా సమితి సమావేశాల్లో రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య, హరినాథ్ రెడ్డి పాల్గొంటారని వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ 26న పులివెందులలో జరిగే ఆందోళనలో జి. ఈశ్వరయ్య పాల్గొంటారని చంద్ర తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు జి. వేణుగోపాల్, కె.సి. బాదుల్లా తదితరులు పాల్గొన్నారు.


