ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొత్తమాధవరంలో గురువారం షార్ట్ సర్య్కూట్ కారణంగా ఒక ఇంటిలో మంటలు చెలరేగి ఆస్తి నష్టం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. కొత్తమాధవరంలోని రాముడి గుడివీధిలో ఉన్న ఎన్.వెంకటసుబ్బయ్య ఇంటిలో గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో షార్ట్ సర్య్కూట్ సంభవించి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదాన్ని గ్రహించిన ఇంటి నివాసులు బయటికి పరుగులు తీశారు. మంటలు ఎక్కువ కావడంతో ఇంటిలోని కూలర్, ఎల్ఈడీ టీవీ, రైస్ కుక్కర్, బట్టలు టేబుల్ ఫ్యాన్, సెల్ఫోనులు దగ్ధం అయినట్లు ఇంటి యజమాని తెలిపారు. వీటి విలువ సుమారు రూ.లక్ష 50 వేలు ఉంటుందని ఆయన అన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళితే.. పెద్దమండ్యం మండలం సిద్దవరానికి చెందిన శ్రీకాంత్(27) గురువారం ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు బయలుదేరాడు. సిద్దవరం మలుపు వద్దకు వెళ్లాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి శ్రీకాంత్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు.


