● ఒకేసారి వ్యవస్థాపక దినోత్సవం,
కాన్వకేషన్ డే
● వీసీ బెల్లంకొండ రాజశేఖర్తో ఇంటర్వ్యూ
? కాన్వకేషన్ డేకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు
వీసీ : యోగివేమన విశ్వవిద్యాలయం 11,12,13,14వ కాన్వకేషన్లు ఒకేసారి నిర్వహిస్తున్నాం. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. విశ్వవిద్యాలయ కులపతి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, విద్యాశాఖామంత్రి నారా లోకేష్ అతిథులుగా రానున్నారు. ప్రతిభావంతులైన 141 మంది విద్యార్థులకు 176 గోల్డ్ మెడల్స్ ఇవ్వనున్నాం. 64 మంది విద్యార్థులు డాక్టరేట్ పట్టాలు అందుకోనున్నారు. దాంతోపాటుగా 11,664 మంది డిగ్రీ పట్టభద్రులు, 1692 మంది పీజీ పట్టభద్రులకు పట్టాలు అందజేయనున్నాం.
? ఎన్ఐర్ఎఫ్లో వైవీయూ ఏ స్థానంలో ఉండాలని
కోరుకుంటున్నారు
వీసీ: నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్కు (ఎన్.ఐ.ఆర్.ఎఫ్) ర్యాంకులో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో 50 నుంచి 100లోపు ర్యాంకులో ఉన్నాం. రానున్న రోజుల్లో ఆ ర్యాంకు 1 నుంచి 50 లోపు తెచ్చుకునేలా లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అలానే విశ్వవిద్యాలయాల స్థాయిలో వందలోపు లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. ఆ దిశగా కష్టపడుతున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాల్లో నాలుగో స్థానంలో ఉన్నాం. ఆ స్థానం 1 లేదా 2వ స్థానంలోకి తీసుకురావడానికి సమష్టిగా కృషి చేస్తున్నాం.
? న్యాక్ నుంచి ఎలాంటి గ్రేడ్ను ఆశిస్తున్నారు
వీసీ: నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సెల్ (ఎన్ఏఏసీ) ఎ ప్లస్ ప్లస్ గ్రేడును పొందాలనేది మా అందరి లక్ష్యం. అందుకు తగ్గట్టు సిద్ధమవుతున్నాం.
? విద్యార్థుల ప్రవేశాల సంఖ్య తగ్గడానికి
కారణం ఏమిటని భావిస్తున్నారు
వీసీ: గత సంవత్సరం యాబై శాతం మాత్రమే అడ్మిషన్లు అయ్యాయి. ఈ సారి 70 శాతం అడ్మిషన్లు చేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. ఆ దిశగా ఫ్యాకల్టీ మొత్తం ప్రయత్నం చేస్తున్నారు.
? పీజీ విద్యార్థులు వైవీయూలోనే ఎందుకు చేరాలి,
ఇక్కడున్న ప్రత్యేకతలు ఏమిటి
వీసీ: విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునే వాతావరణం, వనరులు, క్వాలిఫైడ్ అధ్యాపకులు ఉన్నారు. నేను వైస్ చాన్సిలర్గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్), స్టేట్ ఎలిజిబులిటీ టెస్ట్ (సెట్)కు శిక్షణ ఇస్తున్నాం. హైదరాబాద్ – సెంట్రల్ యూనివర్సిటీలో 25 ఏళ్లు నేను శిక్షణ ఇచ్చాను. అక్కడ ఉత్తమ ఫలితాలు సాధించాం. ఆ విధానాన్ని ఇక్కడ అమలు చేస్తున్నాం. స్వయంగా ప్రతి రోజూ ఉదయం 9 నుంచి 10 గంటల వరకు వైస్ చాన్సిలర్గా క్లాస్ తీసుకుంటున్నాను. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు జేఆర్ఎఫ్ క్వాలిఫై అయ్యారు. రానున్న రోజుల్లో ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల్లో వైవీయూ విద్యార్థులు ఉండాలన్నదే మా ప్రయత్నం.
? విద్యార్థులను విద్య పరంగా
మరింత అభివృద్ధి దిశగా తీసుకొచ్చేందుకు
తీసుకుంటున్న చర్యలు
వీసీ: జాతీయ స్థాయిలో వివిధ రంగాల్లో ప్రముఖులను ఆహ్వానించి లెక్చర్ ఇప్పిస్తున్నాం. తద్వారా విద్యార్థులకు జ్ఞానం పెరగడంతోపాటు వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారిని స్పూర్తిగా తీసుకుని చదువుకునేందుకు అవకాశం ఉంటుంది.
? ఉద్యోగాల కోసం ఏ చర్యలు చేపట్టారు
వీసీ: వైవీయూలో ఉద్యోగాల కల్పనకు జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. అందుకు తగ్గ నైపుణ్యాలను అందించేందుకు శిక్షణలు ఇస్తున్నాం. ఉద్యోగాలు పొందే సామర్థ్యం, నైపుణ్యాలు పెంచనున్నాం. ముఖ్యంగా విలువలతో కూడిన విద్య, నైపుణ్య ఆధారిత విద్య అందిస్తున్నాం.
? రానున్న రోజుల్లో కొత్త కోర్సులు తీసుకురానున్నారా
వీసీ: జాతీయ విద్యా విధానం –2020 అనుసరించి కోర్సుల నిర్వహణ సాగుతోంది. బీటెక్ ఏఐఎం (ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్), ఎంబీఏలో బిజినెస్ అనలిటిక్స్ తెస్తున్నాం. అలానే 4 ఏళ్ల ఆనర్స్, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు తీసుకురానున్నాం. ఇంటర్లోనే విద్యార్థులు విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించే అవకాశం కల్పించనున్నాం.
? విశ్వ
విద్యాలయ
బలం ఏమిటని భావిస్తున్నారు
వీసీ : వైవీయూ 650 ఎకరాల్లో
అన్ని వసతులతో ఆరోగ్యకరమైన క్యాంపస్,
అతిపెద్ద లైబ్రరీ, వంద మంది సహాయ, సహ ఆచార్యులు,
ఆచార్యులు ఉన్న విశ్వవిద్యాలయం వైవీయూ. ఎక్కువ మంది
విదేశాలలో పరిశోధనలు చేస్తూ ఉంటూ ఇక్కడ అపాయింట్
అయినవారు కావడం వల్ల వారి పరిశోధనలు నాణ్యమైనవి. వారి మార్గదర్శకంలో
నాణ్యమైన పరిశోధనలు వస్తున్నాయి.
యోగివేమన విశ్వవిద్యాలయానికి ఒకేసారి రెండు పండుగలు వచ్చాయి. వైవీయూ ఏర్పాటై ఇరవై వసంతాలు
పూర్తి చేసుకొన్న సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవం ఒకటి కాగా మరొకటి కాన్వకేషన్(స్నాతకోత్సవం)
పండుగ. వ్యవస్థాపక దినోత్సవం ఈ నెల 9వ తేదీ కాగా, ఈ నెల 13న కాన్వకేషన్ డే. యోగివేమన
విశ్వవిద్యాలయం రెండు దశాబ్దాల కాలంలో తనతోపాటు ఏర్పాటైన విశ్వవిద్యాలయాల కంటే ముందు ఉంటూ పూర్వపు విశ్వవిద్యాలయాలతో పోటీపడుతూ ముందుకు వెళుతోంది. మరో మూడేళ్లలో
విశ్వ విద్యాలయ రూపురేఖలు మార్చి విద్యార్థులు ప్రపంచంలోని అత్యున్నత సంస్థల్లో అవకాశాలు
అందుకునేలా చూడాలన్నదే మా అందరి సంకల్పం అని యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లం కొండ రాజశేఖర్ అన్నారు. బాధ్యతలు తీసుకున్న మూడు మాసాల్లోనే విశ్వవిద్యాలయ ప్రగతికి ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టిన బెల్లం కొండ రాజశేఖర్తో సాక్షి ఇంటర్వ్యూ. – కడప ఎడ్యుకేషన్


