కడప ఎడ్యుకేషన్ : మీరు అనుకున్న విధానపరమైన నిర్ణయాలు ఏకపక్షంగా అమలుపరిచేటప్పుడు శుక్రవారం శుక్రవారం ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఎందుకని, కేవలం కంటి తుడుపు చర్య కాక మరి ఏమిటని రాష్ట్రోపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి విద్యాశాఖ ఉన్నతాధికారులను సూటిగా ప్రశ్నించారు. కడప ఎస్టీయూ కార్యాలయంలో శనివారం ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు ప్రభుత్వానికి వారధి లాంటి ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకొనకుండా ఏకపక్షంగా విధానపర నిర్ణయాలను ఉపాధ్యాయుల మీద రుద్దడం సరికాదన్నారు. అందుకు తాజా రుజువు అమరావతి నుంచి నియామకం చేస్తున్న పరీక్షల విధుల విధానం ఆటోమేషన్ అని, క్షేత్రస్థాయిలో మహిళా ఉపాధ్యాయులు, అనారోగ్య బాధితులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఇవి ఒత్తిడితో కూడిన విధులని వీటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ అధికారులు నిర్ణయించడం మంచిదని ఆయన సూచించారు. మీరు అమలుపరుస్తున్న ప్రస్తుత ప్రశ్నాపత్రాల తయారీ విధానం గానీ అసెస్మెంట్ రిజిస్టర్ మూల్యాంకన విధానం కానీ, విద్యా శక్తి గాని 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు కానీ, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల నిర్వహణ కానీ ఇలా ఏమి తీసుకున్న కేవలం ఉపాధ్యాయులను సతాయించడం తప్ప అంతిమంగా పాఠశాల కానీ ఉపాధ్యాయులకు కానీ విద్యార్థులకు గాని ఎటువంటి లాభం చేకూరడం లేదని అన్నారు. చివరకు స్థానిక సెలవులకు సైతం అమరావతి వైపు చూడాల్సి వస్తోందని వీటన్నింటిపైనా విద్యాశాఖ మంత్రి జోక్యం చేసుకొని ఉపాధ్యాయ సంఘాలతో సమీక్ష చేయాలని వచ్చే విద్యా సంవత్సరం ఫలితం ఆధారంగా మాత్రమే సంస్కరణలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త అధ్యక్షులు ఇలియాస్ బాషా, సీనియర్ నాయకులు బాలగంగి రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రవిశంకర్రెడ్డి, మహబూబ్ బాషా, కడప రూరల్ రీజనల్ కన్వీనర్ సుదర్శన్రెడ్డి, కడప అర్బన్ రీజినల్ కన్వీనర్ అస్లం, జిల్లా నాయకులు అనిల్, తులసీదర్, శివప్రసాద్రెడ్డి, సుబ్బారెడ్డి, హరింద్రనాథ్, వెంకటరమణ, కడప నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సాదిక్ అలీ, సత్యనారాయణ, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు మస్తాన్ బాబు తదితరులు పాల్గొన్నారు.


