కడప సెవెన్రోడ్స్ : పదవ తరగతి పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేలా బోర్డు నిబంధనల మేరకు అన్ని రకాల చర్యలను పక్కాగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లోని సభా భవన్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత నిర్వాహక అధికారులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమానికి జేసీతోపాటు పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్, ఎగ్జామినేషన్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఈ పబ్లిక్ పరీక్షలు మార్చి 16 తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జిల్లాలోని 169 పరీక్ష కేంద్రాలలో నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో గుర్తించిన 9 సమస్యాత్మక పరీక్షా కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఈ సందర్భంగా పరీక్షకు హాజరయ్య నిర్వాహకులు తీసుకోవలసిన జాగ్రత్తలు, విధులు తదితరాంశాలపై మాస్టర్ ట్రైనర్ రెహమాన్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి షంషుద్దీన్, డిప్యూటీ డీఈవోలు రాజశేఖర్రెడ్డి, మీనాక్షి, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ సాంబశివరెడ్డి, డిసిఈబి చైర్మన్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్లు, డిపార్డమెంటల్ అధికారులు, ఎంఈఓలు తదితరులు పాల్గొన్నారు.


