కమలాపురం: ప్రతి ఒక్క వాహన డ్రైవర్ భద్రతా నియమాలు పాటించాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు, భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) హెడ్ రామమూర్తి తెలిపారు. గురువారం జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని సేఫ్టీ ఆఫీసర్ జి.మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని నల్లింగాయపల్లెలో వెలసిన బీసీసీపీఎల్లో ఆయన వాహన డైవర్లకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ట్రక్స్, ట్రాక్టర్స్, బైక్స్లకు రేడియం స్టిక్కర్స్ అతికించడంతో పాటు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే నల్లలింగాయపల్లెలో జెడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు రోడ్డు భద్రతా వారోత్సవాలు–2026 పై వ్యాసరచన, చిత్ర లేఖన పోటీలు నిర్వహించారు. కమలాపురం పాలిటెక్నిక్ కళాశాలలో కార్పొరేట్ సేఫ్టీ విభాగానికి చెందిన అధికారిణి అమూల్య పర్యవేక్షణలో రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. లూయిస్ వికాట్ డీఏవీ భారతి విద్యామందిర్లో కూడా భద్రతా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి వాహన డ్రైవర్ రోడ్డు భద్రతా నియమాలు పాటించినపుడే గమ్య స్థానాలకు సురక్షితంగా చేరవచ్చన్నారు. డ్రైవర్లు అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రమాదాల బారిన పడతారని, తద్వారా కుటుంబ సభ్యులు వీధిన పడతారని గుర్తు చేశారు. వాహనాలు నడిపే సమయంలో ఒక్క సారి తమ భార్యా, పిల్లలను గుర్తు చేసుకోవాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో హెల్మెట్, సీటు బెల్ట్ తప్పక ధరించాలన్నారు. ముఖ్యంగా మద్యం సేవించి, సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడపవద్దని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దన్నారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్ భార్గవ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీఏవీ భారతి విద్యా మందిర్లో చిన్నారులకు భద్రతా అవగాహన కల్పిస్తున్న ప్లాంట్ ప్రతినిధులు
నల్లలింగాయపల్లె జెడ్పీ హైస్కూల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారావు, రామమూర్తి తదితరులు


