● రాయలసీమ ఎత్తిపోతలపై 11 జిల్లాల రౌండ్ టేబుల్ సమావేశం గ్రాండ్ సక్సెస్
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు
పి. రవీంద్రనాథ్రెడ్డి
కడప కార్పొరేషన్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం కోసం ప్రభుత్వం కళ్లు తెరిపించేలా పెద్ద ఎత్తున ఉద్యమించాలని తీర్మానించినట్లు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎలా సాధించాలి, భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి అనే దానిపై 11 జిల్లాల ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో చర్చించామన్నారు. కలిసొచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కూడా కలుపుకొని ఈ ఉద్యమం చేపట్టాలని నిర్ణయిచామన్నారు. రాయలసీమకు కేంద్రంగా ఉన్న కడపలో నిర్వహించిన మొట్ట మొదటి రౌండ్ టేబుల్ సమావేశం గ్రాండ్ సక్సెస్ అయ్యిందని, దీన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ క ృతజ్ఞతలు తెలిపారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని రచ్చబండ కార్యక్రమాల ద్వారా గ్రామస్థాయిలో వివరించే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నిర్మించవచ్చులే అని ఊరుకుంటే మనం ఎక్కువ నష్టపోతామన్నారు. బచావత్ ట్రిబ్యునల్ వచ్చే అవకాశమున్నందున, ప్రాజెక్టు పనులు కొనసాగుతుంటే నీటి కేటాయింపులు జరిగే అవకాశముంటుందన్నారు. కరువు ప్రాంతమైన రాయలసీమలో వలసలు, ఆత్మహత్యలు ఆగాలంటే ఈ ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. చంద్రబాబు ప్రజల ఓట్లతో గెలిచి ఉంటే రైతులు, ప్రజల సమస్యలు తెలిసేవని, ఈవీఎంల వల్ల వచ్చినందునే తెలియలేదన్నారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నా బాబు నోరు మెదపడం లేదన్నారు. 196 టీఎంసీల నుంచి 70 టీఎంసీలకు తగ్గిస్తే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. చంద్రబాబు 4 సార్లు సీఎంగా పనిచేసినా ఒక్క ప్రాజెక్టు కానీ, ఒక్క ఇండస్ట్రీ కానీ నెలకొల్పలేదన్నారు. ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క సంక్షేమ పథకమూ లేదని ఎద్దేవా చేశారు.ఎన్టీఆర్, వైఎస్ఆర్, వైఎస్ జగన్ల పేర్లు చెబితే కొన్ని పథకాల పేర్లు గుర్తుకొస్తాయని, చంద్రబాబు పేరు చెబితే మోసం, వెన్నుపోటు గుర్తుకు వస్తాయన్నారు. కర్ణాటక లో అప్పర్ భద్ర కడితే, అల్మట్టి ఎత్తు పెంచితే దిగువకు నీరు వచ్చే పరిస్థితి ఉండదన్నారు. ఇంత జరుగుతున్నా చంద్రబాబు వాటిని అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్నారు. కేంద్రం దృష్టికి తీసుకెళ్లి ఉద్యమిస్తే తాము అండగా నిలుస్తామన్నారు.వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి వై. శ్రీరంజన్రెడ్డి, మునిశేఖర్రెడ్డి, ఫయాజ్ పాల్గొన్నారు.


