లింగాల : లింగాల మండలం ఇప్పట్ల గ్రామ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఆదివారం రాత్రి ఢీకొన్నాయి. ఈ ఘటనలో అనంతపురం జిల్లా గొడ్డుమర్రి గ్రామానికి చెందిన అప్పల గంగాధర్ (35) మృతి చెందాడు. వివరాలలోకి వెళితే.. అప్పల గంగాధర్ పెద్దకుడాల శ్రీగంగమ్మదేవత తిరునాలకు వెళ్లి అక్కడ నుంచి పులివెందులకు వెళుతుండగా ఇప్పట్ల గ్రామ సమీపంలో పులివెందులకు చెందిన శ్రీహరి, విశ్వరూప్ అనే యువకులు పెద్దకుడాలకు వస్తుండగా ఎదురెదురుగా బైక్లు ఢీకొన్నాయి. తీవ్రంగా గాయపడిన గంగాధర్ను వెంటనే పులివెందుల సర్వజన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందారని ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు.
లారీఢీకొని..
రాజంపేట: మండలంలోని బోయనపల్లె(కడప–రేణిగుంట హైవే)లోని ఎంజీపురం క్రాస్రోడ్లో బళ్లారి నుంచి చైన్నెకు వెళుతున్న లారీ (కేఎ34డీ5025) రోడ్డు దాటుతున్న గుర్తుతెలియని వ్యక్తిని సోమవారం ఢీ కొనడంతో అక్కడిక్కడే మృతిచెందాడు. మన్నూరు పోలీసులు సంఘటన స్ధలానికి చేరుకున్నారు. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టరం నిమిత్తం రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు.
కారు ఢీకొని..
నందలూరు : కడప–చైన్నె జాతీయ రహదారిలోని చెయ్యేరు బ్రిడ్జి వద్ద నీలిపల్లి గ్రామానికి చెందిన సిరివరం పెంచలయ్య (50)ను కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ సంఘటన సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. పెంచలయ్య బస్టాండ్ వైపు నడుచుకొని వెళ్తుండగా కారు ఢీకొట్టి నిలపకుండా వెళ్లిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని ఒంటిమిట్ట వద్ద అదుపులోకి తీసుకున్నారు. క్షతగాత్రున్ని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.


