నిరాశ్రయులను ఆదుకుంటాం
– ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
కడప సెవెన్రోడ్స్ : నిరాశ్రయులను అన్ని విధాలా ఆదుకుంటామని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం నిరాశ్రయుల వసతి గృహం నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి నిరాశ్రయులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇన్నాళ్లు తాము తలదాచుకుంటున్న పాత జెడ్పీ గెస్ట్హౌస్ను కూల్చి వేస్తున్నారని తెలిపారు. మరుగుదొడ్లు ఇటీవలే నిర్మించారని, అయితే వంట గది నిర్మాణం అర్ధాంతరంగా ఆగిపోయిందన్నారు. వారం రోజులు సమయం ఇస్తే వంట గది పూర్తి చేసుకుంటామని ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డితో మాట్లాడి న్యాయం చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు.
కమలాపురం దర్గాలో కాటసాని ప్రార్థనలు
కమలాపురం : కమలాపురం పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, జహీరియాను వైఎస్సార్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సందర్శించారు. ఆదివారం దర్గా చేరుకున్న ఆయన పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని కలిసి ఆశీర్వాదం పొందారు. అలాగే దర్గా కన్వీనర్, వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్తో కలిసి దర్గాలో స్వామి వారి మజార్ల పై పూల చాదర్ సమర్పించి ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. దర్గా విశిష్టత, ఈ ఏడాది జరగనున్న ఉరుసు ఉత్సవాల గురించి ఇస్మాయిల్ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాటసానిని పీఠాధిపతి దర్గా మర్యాదలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో దర్గా ముజావర్లు, భక్తులు పాల్గొన్నారు.
తెలుగుగంగ కాలువ నీటిలో చిక్కుకున్న దుప్పి
కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె వద్ద ఉన్న తెలుగుగంగ కాలువలో ఆదివారం ఓ దుప్పి అదుపుతప్పి పడింది. స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం ఇచ్చారు. పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు ఎఫ్బీఓ హసాన్బాషా అక్కడికి చేరుకున్నారు. ఆయన స్థానికుల సహకారంతో కాలువలోని దుప్పిని తాడు సాయంతో బయటికి తీసి అడవిలో వదలిపెట్టారు. దుప్పి నీటి కోసం కాలువ దగ్గరికి వచ్చినట్లు స్థానికులు భావిస్తున్నారు.
ఉపాధ్యాయుల తీరుపై
గ్రామస్తుల నిరసన
ముద్దనూరు : మండల పరిధి రాజులగురువాయిపల్లెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల పని తీరుపై గ్రామస్తులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పాఠశాలను దత్తత తీసుకుని అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే పాఠశాలలోని ఒకరిద్దరు ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్ల బోధన సక్రమంగా సాగడం లేదని ఆరోపించారు. విద్యాబోధనలో నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, పాఠశాలలో క్రమశిక్షణ లోపించిందని పలు మార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని పేర్కొన్నారు. ఓ ఉపాధ్యాయుడు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, తక్షణమే పాఠశాలలోని ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఎంఈవో నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
నిరాశ్రయులను ఆదుకుంటాం
నిరాశ్రయులను ఆదుకుంటాం


