గాయపడిన వ్యక్తి మృతి
లింగాల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల పట్టణానికి చెందిన జూటూరు రమేష్రెడ్డి(41) శనివారం ఉదయం పులివెందుల నుంచి పెద్దకుడాల గ్రామానికి వస్తుండగా ఇప్పట్ల గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో గాయపడిన రమేష్రెడ్డి కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందారని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య పావని, కుమార్తెలు అనిత, జ్ఞానశ్రీలు ఉన్నారు. కుటుంబ పెద్ద అయిన రమేష్రెడ్డి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు.
విద్యుదాఘాతంతో..
కాశినాయన : మండలంలోని పాపిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వరరాజా(45) విద్యుదాఘాతంతో మంగళవారం మృతి చెందాడు. ఎస్ఐ యోగేంద్ర తెలిపిన వివరాల మేరకు.. రాజా మేకలు మేపుకొనేందుకు మంగళవారం పొలానికి వెళ్లాడు. వాటిని సాయంత్రం ఇంటికి తోలుకుని వచ్చాడు. అయితే అందులో ఒక మేక కనిపించకపోవడంతో తిరిగి పొలానికి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన పాలకొలను సీతారామిరెడ్డి తన పొలానికి విద్యుత్త్ తీగెలతో కంచెను ఏర్పాటు చేశాడు. పొలంలోకి వెళ్లిన రాజా విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ యోగేంద్ర తెలిపారు.
హోటళ్లు, పాల విక్రయ
కేంద్రాల్లో తనిఖీలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లా కలెక్టర్ఆదేశాల మేరకు మంగళవారం కడప నగరంలోని పలు హోటళ్లు, పాల విక్రయ కేంద్రాల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ రామచందర్, ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత తనిఖీలు నిర్వహించారు. ప్రజల ఆహార భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టడంలో భాగంగా ప్రజా ఆరోగ్య సంరక్షణకు జిల్లా కేంద్రంలో పలు పాల కేంద్రాలు, రెస్టారెంట్లను తనిఖీ చేశారు. హోటల్, హలీం సెంటర్ నిర్వాహకులకు పరిశుభ్రమైన వాతావరణంలో ఆహారాన్ని ప్రజలకు అందించాలని వారు ఆదేశించారు. రెస్టారెంట్ నిర్వాహకులు టేస్టింగ్ సాల్ట్, కలర్స్ వాడకూడదని హెచ్చరించారు. నిరంతరం తనిఖీలు చేపట్టి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
గాయపడిన వ్యక్తి మృతి


