దేదీప్యమానం.. దేవీ వైభవం
● వైభవంగా శ్రీ ఈశ్వరీమాత
ఆరాధనోత్సవాలు
● భారీగా తరలి వస్తున్న భక్తులు
● ఘనంగా ఏర్పాట్లు
బ్రహ్మంగారిమఠం : దేవీ వైభవం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బ్రహ్మంగారిమఠంలోని జగన్మాత శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరాధన గురుపూజోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయానికి రంగులతో మెరుగులద్దారు. దేవాలయంతోపాటు పరిసరాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రాంగణంలో శోభాయమానంగా రంగవళ్లులు వేశారు. ఆకట్టుకునేలా ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. వెరసి ఉత్సవాలను పురస్కరించుకుని నూతన శోభ సంతరించుకుంది.
కమనీయంగా అశ్వవాహనోత్సవం
ఉత్సవాల్లో రెండో రెండో రోజైన శుక్రవారం ఈశ్వరీదేవికి ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు చేపట్టారు. బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన శ్రీ అభయ సీతారామా భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజన భక్తులను అలరించింది. మధ్యాహ్నం కమనీయంగా అశ్వవాహనోత్సవం జరిగింది. అమ్మవారు అశ్వవాహనంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంగీత విభావరి ప్రదర్శించారు. రాత్రి హంస వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. ఉభయ దాతలుగా బద్వేలు మండలం కుమ్మరకొట్టాలుకు చెందిన గోవిందిన్నె సుబ్బరాయుడు ఆచారి, విజయలక్ష్మి, విజయవాడకు చెందిన గుంటముక్కల ఉమామహేశ్వరరావు, నిర్మల, బ్రహ్మంగారిమఠం మండలం బొగ్గులవారిపల్లెకు చెందిన బొగ్గుల ఈశ్వరనారాయణరెడ్డి, శారదాంబ, గోవిందరెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వంక వేణుగోపాల్, సుగుణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సునీత దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు వారు అల్పాహారం పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కాణిపాక వరిసిద్ధి వినాయక దేవాలయం ట్రస్టు బోర్డు డైరెక్టర్ తూర్పునాటి వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిటీ గౌరవ అధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, అధ్యక్షురాలు అంగల కుదుటి సుశీల, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కొలకలూరు భారతీదేవి తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రధాన వేడుక
శ్రీఈశ్వరీదేవి 1789లో మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారి ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శనివారం ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో చేరుకున్నారు. మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పిస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతి దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం జగన్మాతకు దీక్షా బంధన అలంకరణ ఉంటుంది. రాత్రి సింహవాహన గ్రామోత్సవం, తులాభారం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
కోలాటం ఆడుతున్న కళాకారులు
హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు
దేదీప్యమానం.. దేవీ వైభవం


