వైర్ల చోరీపై కేసు నమోదు
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి వైర్లు చోరీ జరిగినట్లు గ్రామ రైతు మోపూరి పెద్దదస్తగిరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ వైర్ల విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు.
కారు దగ్ధం
కడప అర్బన్ : కడప నగరంలోని శంకరాపురంలో ఓ కారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సోమవారం దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రూ. 2..50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు కడప అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి యోగీశ్వర్ రెడ్డి తెలిపారు.
పీజీ వైద్య విద్యార్థినికి
గోల్డ్ మెడల్
కడప అర్బన్ : డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పీజీ పరీక్షల్లో కడప ప్రభుత్వ వైద్యకళాశాల (రిమ్స్) అనస్థీషియా విభాగానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని డాక్టర్ ఎం. సంధ్యారాణి అత్యధిక మార్కులు(637/800) సాధించారు. దీంతో ఆమె యూనివర్సిటీ గోల్డ్ మెడల్కు ఎంపికై నట్లు కడప మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జమున తెలిపారు. డాక్టర్ ఎం.సంధ్యారాణిని ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ నాగశ్రీలత, అనస్తీషియా డాక్టర్ సునీల్ చిరువెళ్ల, వైద్యులు, వైద్య విద్యార్థులు అభినందించారు.
అసాంఘిక కార్యకలాపాలపై డ్రోన్ కెమెరాల నిఘా
కడప అర్బన్ : గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప వన్ టౌన్ సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో కడప నగరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పట్టారు. సోమవారం పాత బస్ స్టాండ్, బుగ్గవంక పరివాహక ప్రాంతం, గుర్రాల గడ్డ, రవీంద్ర నగర్ తదితర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో అనుమానితులను గుర్తించారు.
బాలిక అదృశ్యం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మారయ్యగారిపల్లికి ఓ వివాహ వేడుకకు వచ్చిన బాలిక(16) గత నెల 28 నుంచి కనిపించడం లేదని సోమవారం ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన బాలిక ఒంటిమిట్టలో జరిగే ఓ వివాహానికి మారయ్యగారిపల్లెకు చెందిన తన మేనత్త ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. గత నెల 28 వ తేదీన ఆమె అదృశ్యమైంది. అన్నిచోట్ల గాలించినా ఫలితంలేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వైర్ల చోరీపై కేసు నమోదు
వైర్ల చోరీపై కేసు నమోదు


