పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తి చేయాలి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఈఆర్ఓలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)–2026పై సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన రాజకీయ పార్టీల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ ప్రక్రియలో ప్రతిపాదించిన కేంద్రాలను స్వయంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం ధ్రువీకరించి ప్రతిపాదనలు సమర్పించాలని ఈఆర్ఓ, ఏఈఆర్ఓలను ఆదేశించారు. సదరు ప్రతిపాదనలను రాజకీయ పార్టీ ప్రతినిధుల సమక్షంలో పునఃపరిశీలన అనంతరం ఎన్నికల కమిషన్కు నివేదిక పంపిస్తామన్నారు. ఇందుకు సంబంధించి ప్రతి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలను ప్రత్యక్షంగా సందర్శించాలని ఆదేశించారు. ప్రస్తుతం జిల్లాలో 1963 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, కొత్తగా 158 పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలు అందాయని తెలిపారు. రేషనలైజేషన్ తర్వాత జిల్లాలో మొత్తం 2121 పోలింగ్ కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయన్నారు.ఇందులో పోలింగ్ కేంద్రాల పేర్ల మార్పు కోసం 11, పోలింగ్ కేంద్రాల స్థానాల మార్పుకు 19 ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయన్నారు. కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు సమయంలో ఒకే కుటుంబ సభ్యులు వేర్వేరు కేంద్రాల్లో ఉండకుండా, అందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఓటర్ల జాబితాలో నమోదు, చేర్పులు, మార్పులు, తొలగింపులు వంటి అంశాలను ఎన్నికల నిబంధనల మేరకు జాగ్రత్తగా చేపట్టాలని ఆయన ఆదేశించారు. వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు ఈ సందర్భంగా నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుపై పలు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్ఓ విశ్వేశ్వర నాయుడు, ఈఆర్ఓలు జాన్ ఐర్విన్,చెన్నయ్య, సాయి శ్రీ, శ్రీనివాసులురెడ్డి (టీడీపీ), హరూన్ బాబు (వైఎస్సార్సీపీ) సయ్యద్ గౌస్పీర్ (కాంగ్రెస్)తోపాటు బీజేపీ, బీఎస్పీ, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఇస్తేమా నిర్వహణకు ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్ : జనవరి 23,24,25 తేదీల్లో కడపలో నిర్వహించనున్న ఇస్తేమా (ఆధ్యాత్మిక సభ) కార్యక్రమ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూఖ్ అఽధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ పీఈఆర్ఎస్ హాలులో ఇస్తేమా కార్యక్రమానికి సంబంధించిన కార్యక్రమ కార్యవర్గ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఇస్తేమా కార్యక్రమాన్ని ఈసారి కడప జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జనవరిలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని కార్యవర్గ కమిటీ సభ్యులు అధికారులు తమ విధులను బాధ్యతగా నిర్వహించాలన్నారు.ఈ కార్యక్రమానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పనకు అధికారులు సహకరించాలని కోరారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడు రోజులపాటు జరగనున్న రాష్ట్రస్థాయి ఇస్తేమా కార్యక్రమాలను పటిష్టంగా నిర్వహించడానికి పక్కా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమ నిర్వహణకు జిల్లాలోని కొప్పర్తి ఏపీఐఐసీ ప్రాంతాన్ని గుర్తించామన్నారు. ఎమ్మెల్యేలు పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, మాధవీరెడ్డి, జేసీ అదితిసింగ్, ఎస్పీ సెల్కే నచికేత్ విశ్వనాథన్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ పార్టీలతో
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి


