
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచికలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్దేశిత లక్ష్యం మేరకు పూర్తి చేయాలన్నారు. ఈ విషయంలో అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ చేయాలన్నారు.
పకడ్బందీగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పరీక్షలు
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం ఆదివారం జిల్లాలో నిర్వహించనున్న స్క్రీనింగ్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీసెస్కు సంబంధించి ఈ నెల 7న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు భర్తీ కోసం ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఉద్యోగాల ఆఫ్లైన్ స్క్రీనింగ్ పరీక్ష మధ్యాహ్నం 3.00 నుంచి 5.30 గంటల వరకు నిర్వహించనున్నామన్నారు.
● పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు 08562– 246344 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని తెలిపారు.
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి