
ముంచుకొస్తున్న సోమశిల ముంపు జలాలు
● సగిలేరు లోలెవల్ వంతెనపైకి వచ్చే ప్రమాదం
● నిలిచిపోనున్న ఆరు పంచాయతీల
రాకపోకలు
● ఆందోళనలో ఆయా గ్రామాల ప్రజలు
అట్లూరు : పెన్నా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.. సోమశిల జలాశయంలో రోజు రోజుకు నీరు పెరుగుతోంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా జలాలు వస్తున్నాయి. వేమలూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్ వంతెనపైకి సోమశిల వెనుక జలాలు నేడో రేపో చేరనున్నాయి. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా.. శుక్రవారానికి 66 టీఎంసీలకు చేరుకున్నాయి. పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో సోమశిల జలాశయంలోకి రోజూ 23.500 కూసెక్కుల నీరు చేరుతోంది. దిగువకు 12 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మిగిలిన 10 వేల పైచిలుకు క్యూసెక్కుల నీరు జలాశయంలో చేరుతుంది. దీంతో రోజుకు ఒక టీఎంసీ నీరు నిల్వ చేరుతుంది. ఈ ఉద్ధృతి ఇలాగే కొనసాగి అధికారులు ఇలాగే నీటిని నిల్వ చేస్తే.. మరో వారం రోజుల లోపే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది. శుక్రవారానికి లోలెవల్ వంతెన లెవల్కు నీరు చేరింది. ఒక టీఎంసీకి అడుగు మేర నీరు వస్తుంది. ఇలాగే కొనసాగితే రెండు లేదా మూడు రోజులకు వేమలూరు వద్ద ఉన్న లోలెవల్ వంతెనపై రాక పోకలు పూర్తిగా నిలిచి పోతాయి.
మండల కేంద్రానికి 40 కిలో మీటర్లు తిరిగి వెళ్లాలి
అట్లూరు మండల పరిధిలో 12 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సగిలేరు నదికి తూర్పున ఆరు, పడమర ఆరు పంచాయతీలు ఉన్నాయి. లోలెవల్ వంతెనపై నీరు రెండు లేదా మూడు అడుగుల మేర చేరితే వాహన రాకపోకలు పూర్తిగా నిలిచి పోతాయి. రాకపోకలు నిలిచిపోతే అట్లూరులో ఉన్న తహసీల్దారు, ఎంపీడీఓ, వెలుగు తదితర మండల కార్యాలయాలతోపాటు పోలీస్స్టేషన్, బ్యాంకులకు వెళ్లాలంటే బద్వేలు మీదుగా 40 కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. సాధారణంగా ఆరు కిలోమీటర్ల దూరం వెళ్తే సరిపోతుంది. ఈ పరిస్థితి సగిలేరు నదికి తూర్పు భాగాన ఉన్న ముత్తుకూరు, వేమలూరు, కామసముద్రం, మాడపూరు, మణ్యవారిపల్లి, కమలకూరు గ్రామ పంచాయతీల పరిధిలోని సుమారు 30 గ్రామాలకు నెలకొంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి సగిలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
వంతెన పైకి నీరు చేరడంతో ప్రమాదం అంచున వెళుతున్న ప్రజలు(ఫైల్)
సగిలేరు నది లోలెవల్ వంతెన లెవల్కు చేరిన సోమశిల ముంపు జలాలు

ముంచుకొస్తున్న సోమశిల ముంపు జలాలు