
చదువుతోనే మంచి భవిష్యత్తు
కడప ఎడ్యుకేషన్ : చదువుతోనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని, ప్రణాళిక బద్ధంగా చదివి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని దీంతోపాటు ప్రపంచస్థాయి పోటీతత్వాన్ని అలవరచుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆకాంక్షించారు. సోమవారం కడప నగర శివార్లలోని శిల్పారామంలో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన జిల్లా విద్యార్థులకు అభినందనలు తెలిపారు. మార్కులనే కొలమానంగా కాకుండా సాంకేతిక పరిజ్ఞానంతో పాటు ప్రపంచ స్థాయి విజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. జిల్లాలో విద్యార్థులు మంచి ఫలితాలు సాధించడంలో ఉపాధ్యాయులు ప్రముఖ పాత్ర పోషించారని ఈ సందర్భంగా వారిని అభినందించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తును నిర్ణయించే గొప్ప అవకాశం గురువులకు దక్కుతుందన్నారు. విద్యార్థులు పట్టుదల, ప్రణాళికతో చదివి ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. డీఈఓ షంషుద్దీన్ మాట్లాడుతూ జిల్లా పది ఫలితాల్లో 80 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 18 వ స్థానంలో ఉందన్నారు.
సన్మానం పొందిన విద్యార్థులు..
● పల్లేటి జోషికా(595), సింహాద్రిపురం మండలం రావులకొలను జెడ్పీ హైస్కూల్
● అతికారి పల్లవి (594) సిద్ధవటం మండలం జెడ్పీ హైస్కూల్
● నీలం నాగ వీర తరుణ్ (593),పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జెడ్పీ హైస్కూల్
● బండి రామసాయి విఘ్నేష్ (593) కాశినాయన మండలం ఏపీ మోడల్ స్కూల్
● రుద్ర గంగ జశ్వంత్ రెడ్డి (592) వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లి గ్రామం జెడ్పీ హైస్కూల్
● అతికారి రక్షిత (591) బద్వేలు మండలం జెడ్పీ హైస్కూల్,
● గంజికుంట వెంకట శివ సంతోష్ (591), జమ్మలమడుగు మండలం ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూఆర్ఎస్ (బాలుర) హైస్కూల్
● జడ కార్తీక్ (590) వేముల మండలం జెడ్పీ హైస్కూల్,
● కోగటం జువేరియ తహసీన్ (590), జమ్మలమడుగు మండలం జెడ్పీ హైస్కూల్,
● గంజికుంట తన్మయి (589) తొండూరు మండలం ఎంజేపీ ఏపీ బీసీ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్ (బాలికలు)
ఈ కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ నిత్యానంద రాజు, ఇతర శాఖల జిల్లా అధికారులు, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్ రెడ్డి, మీనాక్షి, వివిధ మండలాల ఎంఈఓలు, ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
టాప్ ‘టెన్’ విద్యా రత్నాలను సన్మానించిన కలెక్టర్, ఎస్పీ

చదువుతోనే మంచి భవిష్యత్తు